29, డిసెంబర్ 2019, ఆదివారం

శాంతి స్థాపన చేస్తూనే ఉండాలి



శాంతి స్థాపన చేస్తూనే ఉండాలి (సూర్య 1.1.2010)
                   “క్రొత్త ఏడు మొదలు బెట్టేను
                  మన బ్రతుకునందు”                                                  
          అంటూ కాంబోజీ రాగం త్రిపుట తాళంతో క్రైస్తవులు జనవరి ఒకటిన కీర్తన పాడుతారు.ఈ కీర్తన పులిపాక జగన్నాధం గారు మంచి స్పూర్తితో ఆశయాలతో రాశారు.అందుకే ఈ పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో చోటు చేసుకుంది.అందరూ కొత్త నీరొచ్చి పాత నీరు కొట్టుకు పోయినట్లు పాత ఏటికి వీడ్కోలు చెబుతారు. పాత ఒక రోత, కొత్త ఒక వింత అన్నట్లు అందరూ కొత్త ఉత్సాహాన్ని ప్రదర్శించుతారు. పైగా కొత్త ఎద్దు పేడ ఇంటిల్లిపాదీ ఎత్తినట్లుగా హడావుడీ చేస్తారు.ఇస్తినమ్మ వాయనం అంటే పుచ్చుకొంటినమ్మ వాయనం అన్నట్లు “హేపీ న్యూయర్ టుయూ” అంటూ ఎదురు బదురుగా చెప్పుకుంటారు.

          కొత్త ఏడాదిలో ఏదో ఘనకార్యం సాధించబోతున్నట్లు ఫోజులిస్తారు. పాత సంవత్సరం పాడుగాను అంటూ శాపనార్ధాలు పెడతారు. కొత్తది గొర్రెల మడుగు పాతది బర్రెల మడుగు అన్నట్లు ప్రసంగాలు చేస్తారు. అయితే మళ్ళీ ఈ కొత్త సంవత్సరం ఆఖరుకి ఒక్కసారి అయ్యల ప్రవర్తన ఆరా తీసి చూస్తే కొత్తది నేర్వలేదు పాతది మరవాలేదు అన్నట్లే ఉంటుంది. మనతత్వం మారాలిగాని ఏళ్ళు ఎన్ని మారితే ప్రయోజనం ఏమిటి ? కొత్త అప్పుకు పోతే పాత అప్పు పైన బడ్డట్లుగా కొత్త సంవత్సరంలో కొత్త కొత్త జాడ్యాలకు గురయ్యే జనానికీ లోకంలో కొదువలేదు.

          సిగరెట్లు మానేస్తాననీ, సారాయి త్రాగననీ వేశ్యల వలలో చిక్కుకోననీ, మత్తు మందులకు బానిస కాననీ, లంచం తీసుకోననీ, అప్పులు చెయ్యననీ, అబద్ధాలు చెప్పననీ, దొంగతనం చెయ్యననీ, తగాదాలు రేపననీ, బూతు మాటలు పలకననీ, దైవధ్యానం మరువననీ, కష్టపడి పనిచేసి పైకొస్తాననీ,పాత బాకీలన్నీ తీర్చేస్తాననీ, తల్లిదండ్రుల్ని సరిగా చూసుకుంటాననీ... ఇలా ఎన్నో శపధాలు కొత్త ఏట చెయ్యవచ్చు. అయితే వాటిని నిలుపుకోగలవారు ఎంతమంది ? కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్లు జనవరి ఫిబ్రవరి మాసాల్లో చేసిన శపధాలను నూటికి నూరు శాతం అమలు జరిపి మార్చి నెలకే మారి పొయ్యే అయ్యలవల్ల మరింత నష్టం జరుగుతోంది.ఎందుకంటే దర్వ్యసనాలకు బానిసయైన వ్యక్తి పశ్చాత్తాపపడి సన్మార్గం లోకి వచ్చి మళ్ళీ పాప మార్గం పట్ల ఆకర్షితుడై వెళ్ళి పోతే అతని వల్ల సంఘానికి చాలా కీడు జరుగుతుంది.పొయ్యి పక్క వెన్న ముద్దలాగా పదిమందీ అతని వల్ల కరిగి పోతారు.అనుభవ పూర్వకంగా అతను చేసే పాప ప్రసంగాలపట్ల ప్రభావితులై చుట్టూ చేరిన వాళ్ళంతా చెడిపోతారు.“ఎన్నాళ్ళో గడిచాక, ఇన్నాళ్లకు కలిశాక,ఉప్పొంగిన గుండెలకేక ఎగిసేను నింగిదాకా” అనుకుంటూ ఒక తిరోన్ముఖ గుంపు తయారైనా ఆశ్చర్యం లేదు.వాళ్ళను మార్చటం ఎవరి వల్లా కాదు.
          ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకొనే పేరుతో బోలెడు డబ్బు గ్రీటింగులకీ,డైరీలకీ,కేకులకీ ఖర్చు పెట్టడమే కాకుండా, రాత్రంతా సారాయి తాగి వీధుల్లో వెర్రి కేకలేస్తూ బలహీనులపై మూకదాడులుచేస్తూ తిరిగే హంతక గుంపులు బయలు దేరాయి.ఈ గుంపులదెబ్బకు  ఏమంటే ఏమౌతుందో, ఏ మాంసం తింటే ఏమవుతుందో ?అసలు ఏ వస్తువునైనా అమ్మనిస్తారో లేదో అని కొన్నిచోట్ల బలహీనవర్గాలప్రజలు ఈ మూకలహింసకు భయపడాల్సివస్తున్నది. ఆడామగా విచక్షణ లేకుండా పట్టణాలలోని అపార్ట్ మెంట్లలో అర్ధరాత్రి శివాళ్లు జరుగుతున్నాయి.గట్టిని విడిచి పొట్టుకు పారాడినట్లుగా ఈ కొత్త సంవత్సరపు వేడుకలుంటున్నాయి. ఏడాదికేడాది నూతన సంవత్సరం వేడుకలు జరుపుకునే సాంప్రదాయం పెచ్చుమీరుతోంది.ఈ వేడుకలు కార్పొరేట్లకు కాసుల పంటపండిస్తున్నాయి.అంతా వ్యాపారమే. ఏ దేశ సంస్కృతో అర్ధం గావడం లేదు. ఇది శాంతి ప్రవక్త క్రీస్తుకు ముందే బుద్ధుడు పుట్టిన భూమి. గంధం సమర్పయామి అంటే గొడ్డలి నూరరా శిష్యా అన్నాడట ఎవడో. మన తెలుగు ఉగాదిని గుర్తుచేస్తే దానికి ఇది సరిపోదు,ఊరంతా ఒకదారి అయితే ఉలిపికట్టెది మరోదారని విమర్శిస్తారు. ప్రపంచమంతా ఇంగ్లీషు రాజ్యమేలుతుంటే తెలుగు గోల ఎవరు పట్టించుకొంటారని విసుక్కుంటారు.
'నిజంగానే నిజంగానే నిఖిలలోకం హసిస్తుందా?
ధారుణ ద్వేషాగ్ని పెంచే దానవత్వం నశిస్తుందా?
బానిసల సంకెళ్లు బిగిసే పాడుకాలం లయిస్తుందా?' అని శ్రీశ్రీ ఆశించాడు.
ప్రజా నాయకులుకూడా గతించిన కాలంలోని అనుభవాలను సమీక్షించుకొని మరింత మేలైన మార్గాలు అవలంబించాలి. ప్రజలలోనుంచి మద్యం,హింసా ప్రవృత్తి,అత్యాచారాలు,లాటరీలు,కుల మత  వివక్షలు లాంటి దుర్మార్గాలు నశించి పోవాలి. సర్వమానవ సౌభ్రాతృత్వం దేశంలో విలసిల్లాలి. కొత్త ఏటిని  శాంతిదాయకమైన సంవత్సరంగా మనమే మలచాలి. కాలం దానంతట అదే దేన్నీ తీసుకు రాదు. చరిత్ర మన చేతల ద్వారానే నిర్మించబడుతుంది. మత కలహాలకు, మద్యపానం లాంటి చెడు అలవాట్లకు స్వస్తి చెప్పి శాంతి స్థాపనకోసం శపదం చేద్దాం !
    నూర్ బాషా రహంతుల్లా ,
విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ 6301493266