29, డిసెంబర్ 2019, ఆదివారం

శాంతి స్థాపన చేస్తూనే ఉండాలి



శాంతి స్థాపన చేస్తూనే ఉండాలి (సూర్య 1.1.2010)
                   “క్రొత్త ఏడు మొదలు బెట్టేను
                  మన బ్రతుకునందు”                                                  
          అంటూ కాంబోజీ రాగం త్రిపుట తాళంతో క్రైస్తవులు జనవరి ఒకటిన కీర్తన పాడుతారు.ఈ కీర్తన పులిపాక జగన్నాధం గారు మంచి స్పూర్తితో ఆశయాలతో రాశారు.అందుకే ఈ పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో చోటు చేసుకుంది.అందరూ కొత్త నీరొచ్చి పాత నీరు కొట్టుకు పోయినట్లు పాత ఏటికి వీడ్కోలు చెబుతారు. పాత ఒక రోత, కొత్త ఒక వింత అన్నట్లు అందరూ కొత్త ఉత్సాహాన్ని ప్రదర్శించుతారు. పైగా కొత్త ఎద్దు పేడ ఇంటిల్లిపాదీ ఎత్తినట్లుగా హడావుడీ చేస్తారు.ఇస్తినమ్మ వాయనం అంటే పుచ్చుకొంటినమ్మ వాయనం అన్నట్లు “హేపీ న్యూయర్ టుయూ” అంటూ ఎదురు బదురుగా చెప్పుకుంటారు.

          కొత్త ఏడాదిలో ఏదో ఘనకార్యం సాధించబోతున్నట్లు ఫోజులిస్తారు. పాత సంవత్సరం పాడుగాను అంటూ శాపనార్ధాలు పెడతారు. కొత్తది గొర్రెల మడుగు పాతది బర్రెల మడుగు అన్నట్లు ప్రసంగాలు చేస్తారు. అయితే మళ్ళీ ఈ కొత్త సంవత్సరం ఆఖరుకి ఒక్కసారి అయ్యల ప్రవర్తన ఆరా తీసి చూస్తే కొత్తది నేర్వలేదు పాతది మరవాలేదు అన్నట్లే ఉంటుంది. మనతత్వం మారాలిగాని ఏళ్ళు ఎన్ని మారితే ప్రయోజనం ఏమిటి ? కొత్త అప్పుకు పోతే పాత అప్పు పైన బడ్డట్లుగా కొత్త సంవత్సరంలో కొత్త కొత్త జాడ్యాలకు గురయ్యే జనానికీ లోకంలో కొదువలేదు.

          సిగరెట్లు మానేస్తాననీ, సారాయి త్రాగననీ వేశ్యల వలలో చిక్కుకోననీ, మత్తు మందులకు బానిస కాననీ, లంచం తీసుకోననీ, అప్పులు చెయ్యననీ, అబద్ధాలు చెప్పననీ, దొంగతనం చెయ్యననీ, తగాదాలు రేపననీ, బూతు మాటలు పలకననీ, దైవధ్యానం మరువననీ, కష్టపడి పనిచేసి పైకొస్తాననీ,పాత బాకీలన్నీ తీర్చేస్తాననీ, తల్లిదండ్రుల్ని సరిగా చూసుకుంటాననీ... ఇలా ఎన్నో శపధాలు కొత్త ఏట చెయ్యవచ్చు. అయితే వాటిని నిలుపుకోగలవారు ఎంతమంది ? కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్లు జనవరి ఫిబ్రవరి మాసాల్లో చేసిన శపధాలను నూటికి నూరు శాతం అమలు జరిపి మార్చి నెలకే మారి పొయ్యే అయ్యలవల్ల మరింత నష్టం జరుగుతోంది.ఎందుకంటే దర్వ్యసనాలకు బానిసయైన వ్యక్తి పశ్చాత్తాపపడి సన్మార్గం లోకి వచ్చి మళ్ళీ పాప మార్గం పట్ల ఆకర్షితుడై వెళ్ళి పోతే అతని వల్ల సంఘానికి చాలా కీడు జరుగుతుంది.పొయ్యి పక్క వెన్న ముద్దలాగా పదిమందీ అతని వల్ల కరిగి పోతారు.అనుభవ పూర్వకంగా అతను చేసే పాప ప్రసంగాలపట్ల ప్రభావితులై చుట్టూ చేరిన వాళ్ళంతా చెడిపోతారు.“ఎన్నాళ్ళో గడిచాక, ఇన్నాళ్లకు కలిశాక,ఉప్పొంగిన గుండెలకేక ఎగిసేను నింగిదాకా” అనుకుంటూ ఒక తిరోన్ముఖ గుంపు తయారైనా ఆశ్చర్యం లేదు.వాళ్ళను మార్చటం ఎవరి వల్లా కాదు.
          ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకొనే పేరుతో బోలెడు డబ్బు గ్రీటింగులకీ,డైరీలకీ,కేకులకీ ఖర్చు పెట్టడమే కాకుండా, రాత్రంతా సారాయి తాగి వీధుల్లో వెర్రి కేకలేస్తూ బలహీనులపై మూకదాడులుచేస్తూ తిరిగే హంతక గుంపులు బయలు దేరాయి.ఈ గుంపులదెబ్బకు  ఏమంటే ఏమౌతుందో, ఏ మాంసం తింటే ఏమవుతుందో ?అసలు ఏ వస్తువునైనా అమ్మనిస్తారో లేదో అని కొన్నిచోట్ల బలహీనవర్గాలప్రజలు ఈ మూకలహింసకు భయపడాల్సివస్తున్నది. ఆడామగా విచక్షణ లేకుండా పట్టణాలలోని అపార్ట్ మెంట్లలో అర్ధరాత్రి శివాళ్లు జరుగుతున్నాయి.గట్టిని విడిచి పొట్టుకు పారాడినట్లుగా ఈ కొత్త సంవత్సరపు వేడుకలుంటున్నాయి. ఏడాదికేడాది నూతన సంవత్సరం వేడుకలు జరుపుకునే సాంప్రదాయం పెచ్చుమీరుతోంది.ఈ వేడుకలు కార్పొరేట్లకు కాసుల పంటపండిస్తున్నాయి.అంతా వ్యాపారమే. ఏ దేశ సంస్కృతో అర్ధం గావడం లేదు. ఇది శాంతి ప్రవక్త క్రీస్తుకు ముందే బుద్ధుడు పుట్టిన భూమి. గంధం సమర్పయామి అంటే గొడ్డలి నూరరా శిష్యా అన్నాడట ఎవడో. మన తెలుగు ఉగాదిని గుర్తుచేస్తే దానికి ఇది సరిపోదు,ఊరంతా ఒకదారి అయితే ఉలిపికట్టెది మరోదారని విమర్శిస్తారు. ప్రపంచమంతా ఇంగ్లీషు రాజ్యమేలుతుంటే తెలుగు గోల ఎవరు పట్టించుకొంటారని విసుక్కుంటారు.
'నిజంగానే నిజంగానే నిఖిలలోకం హసిస్తుందా?
ధారుణ ద్వేషాగ్ని పెంచే దానవత్వం నశిస్తుందా?
బానిసల సంకెళ్లు బిగిసే పాడుకాలం లయిస్తుందా?' అని శ్రీశ్రీ ఆశించాడు.
ప్రజా నాయకులుకూడా గతించిన కాలంలోని అనుభవాలను సమీక్షించుకొని మరింత మేలైన మార్గాలు అవలంబించాలి. ప్రజలలోనుంచి మద్యం,హింసా ప్రవృత్తి,అత్యాచారాలు,లాటరీలు,కుల మత  వివక్షలు లాంటి దుర్మార్గాలు నశించి పోవాలి. సర్వమానవ సౌభ్రాతృత్వం దేశంలో విలసిల్లాలి. కొత్త ఏటిని  శాంతిదాయకమైన సంవత్సరంగా మనమే మలచాలి. కాలం దానంతట అదే దేన్నీ తీసుకు రాదు. చరిత్ర మన చేతల ద్వారానే నిర్మించబడుతుంది. మత కలహాలకు, మద్యపానం లాంటి చెడు అలవాట్లకు స్వస్తి చెప్పి శాంతి స్థాపనకోసం శపదం చేద్దాం !
    నూర్ బాషా రహంతుల్లా ,
విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ 6301493266

11, అక్టోబర్ 2019, శుక్రవారం

సిగ్గులేని సింగారమే రాజకీయ వయ్యారం


సిగ్గులేని సింగారమే రాజకీయ వయ్యారం
సిగ్గెందుకు లేదురా జగ్గా అంటే, నల్లటివాడిని నాకెందుకు సిగ్గు అన్నాడట. ఆ రోజుల్లో ఈ రోజుల్లో అనే తేడా లేకుండా ఆ పార్టీలోకి ఈ పార్టీలోకి కుప్పిగంతులు వేసే రాజకీయ నాయకులు ఎప్పుడూ ఉంటారు. ఒక పార్టీ తరఫున గెలిచిన తరువాత మందీ మార్బలంతో సహా అవతలి పార్టీలోకి వలస పొయ్యే వాళ్ళూ ఉన్నారు. అయితే వీళ్ళందరిలో ఒకానొక విశిష్ట పదార్థం ఉండదు. ఆ పదార్థం పేరు “సిగ్గు”. ఇది వారిలో కొరవడటం వల్ల పదిమందీ ఏమనుకొంటున్నా వారికి ఏమీ అనిపించదు. అసలు వినిపించదు.
సిగ్గు చిన్ననాడేపోయే, పరువు పందిట్లో పోయే. కొరావా సరవా ఉంటే గదిలో పోయే అన్నట్లు పార్టీలు మారి మారి వీరికి “సిగ్గు పడాలి” అనే సంగతి జ్నాపకం కూడా లేదు. ఇలాంటి జాబితాలో ఒక ప్రముఖుడు ఉన్నాడు . అంతటి ఆచార్యుడు కూడా కొద్దో గొప్పో సిగ్గుపడి పేరు మార్చుకున్నారు ఎందుకంటే ప్రజలు తేలికగా గుర్తించకుండా ! ఏ పార్టీలో చూచినా ఈయనే కనపడేవారు. అందుకని ఆయన్ని “రంగులు మార్చే రంగా” అనే బిరుదుతో ప్రజలు సత్కరించారు. మొదట స్వరాజ్యమనీ, తరువాత స్వతంత్రమనీ అరచిన నాయకులంతా చివరికి కాంగ్రెసనే సముద్రంలో నీటి బొట్టుల్లా, కాకి రెట్టల్లా కలిసి పోయారు. అలా పేరుగాంచిన కాంగ్రెస్ పెద్దలు కూడా ఉల్కల్లాగా బీజేపీ లోకి రాలి పోయారు. సంతానంకోసం సప్త సముద్రాల్లో స్నానం చేస్తే, ఉప్పునీరు తగిలి ఉన్నదికాస్తా ఊడిపోయిందట.కొందరికి పార్టీలు మారటం అసలు కలిసి రాలేదు.
సెబాష్ మద్దెలగాడా అంటే, అయిదువేళ్ళు పగలకొట్టుకున్నట్లు, కొందరు సుబ్బారాయుళ్ళు డబ్బారాయుళ్ళ ఊదరకు దెబ్బతినిపోయారు. సవరదీసినకొద్దీ నిక్కినట్లు ఆరోజు ఎంత బ్రతిమిలాడి భంగపడినా బ్రహ్మానందరెడ్డి గారు కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఇందిరా గాంధీకి ఇవ్వలేదు. చివరికి సిగ్గుమాలిన ముఖానికి నవ్వే అలంకారమన్నట్లు బ్రహ్మానందపడుతూ ఇందిరా కాంగ్రెసులోనే చేరిపోయారు. హర్షుణ్ణి నమ్ముకుని పురుషుణ్ణి పోగొట్టుకున్నట్లు వెంగళరావుగారు అర్సును ఆవు దూడను నమ్ముకుని ముఖ్యమంత్రి పదవి కోల్పోయారు. ఇదే చాన్సనుకొన్న చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రై చక చకా తన తపనంతా తీర్చుకొన్నారు.  అసలు కాంగ్రెస్ లో రాణించాలంటే కొన్ని అర్హతలు తప్పనిసరిగా ఉండాలని అమ్మ నిత్యమూ అంటుండేది. అందులో ప్రధానమైనది “సిగ్గులేనితనమే” నట. “సొంత ఆలోచన లేక పోవటం” కూడా మరొక అర్హత అని మురార్జీభాయ్ శలవిచ్చాడు. అయితే ఈ అర్హతలు కాంగ్రెస్ కే కాదు ఏ  పార్టీకైనా వర్తిస్తాయి అని నాకు నిదానంగా తెలిసింది.పదవిపోయిందని అలిగి నాదెండ్ల, చెన్నారెడ్డి వేరే పార్టీలు పెట్టారు.“వి. బి. రాజుకి పదవి ఇవ్వొద్దు, చెన్నారెడ్డిని ఖాళీగా ఉంచొద్దు” అని వెనుక ఒక సామెత ఉండేది. అయితే సిగ్గుమాలినదాన్ని చిటికేస్తే, ఆరామడనుంచి ఆలకిచ్చిందట.మూపనార్,చవానుల్లాగా పార్టీ బయట నిలబడి కాల్ లెటర్ కోసం ఎదురుతెన్నులు చూస్తున్న నిరుద్యోగులందరికీ ఆహ్వానం రాగానే తట్టాబుట్టా సర్దుకొని సంసిద్ధమయ్యారు.సిగ్గుపడితే ఎలా?
 అరిచే నోరు, తిరిగే కాలు ఊరికే ఉండవన్నారు రాజకీయ పెద్దలు.పాదయాత్రల ప్రభావం చూశాక  తిరిగి రైతు – తిరక్క రాజకీయ  బైరాగి చెడతాన్నారు.పనిదొరకని రాజకీయ బైరాగులు పూటకొక పార్టీ చొప్పున తిరిగీ తిరిగీ  మళ్ళీపాత పార్టీ లోనే చేరి పోయారు. ఎవరికీ వెరవటంలేదు.ఏనుగునెక్కి రంకుకు పోయినట్లుగా పోతున్నారు. శక్తిచాలనివాడు సాధుత్వము వహించినట్లు గోడమీద పిల్లులు కొంత కాలం గమ్మున ఉన్నా మనసంతా సంపాదన గల పార్టీ పైనే పెట్టుకున్నారు.వైసీపీ ఎమ్మెల్యేలు 24 మంది టీడీపీ లోకి దూకారని నలుగురు మంత్రి పదవులనుకూడా పొందారని,పార్టీ ఫిరాయింపుల్ని వెంకయ్యనాయుడు ప్రోత్సహించటం తప్పనీ  స్పీకర్ తమ్మినేని సీతారాం ఆవేదన చెందారు.జూపూడి,సుజనా చౌదరి,వెంకటేశ్,సియంరమేష్... ఇలా వీళ్ళవరస పెరుగుతూనే పోతోంది.భార్యా భర్తలు చెరో పార్టీలో ఉండకూడదని,పాతపార్టీకి పదవికి రాజీనామా చేశాకే కొత్తపార్టీలో చేరాలని కొత్త నిబంధనలు పెట్టినా  జరిగేవి జరుగుతూనే ఉన్నాయి.సిగ్గులేని సింగయ్యలు లంచగొండి అధికారులకు ధీటుగా దేశంలో చాలామంది ఉన్నారు,ఈ నాయకులు కూడా అధికారాన్ని, డబ్బును ఆశించే పార్టీలు మారుతున్నారు.పూర్వం కొంత సిద్ధాంత బలం ఉండేది.నేను చచ్చిందాకా ఒకటే పార్టీ అనే భీష్ములు అంపశయ్యల పాలయ్యారు.ఇప్పుడు మంచి తరుణంలో పార్టీలు మారేవాడే సరైన,తెలివైన  రాజకీయనాయకుడు అంటున్నారు.ఇప్పుడున్న పార్టీలోనే  ఉంటావా మరో పార్టీలోకి దూకుతావా అంటే కార్యకర్తల కోరికమేరకు నడుచుకుంటానని అంటాడు.ఓటర్లు ఏమనుకుంటే మాకేమని కొందరు ఏకంగా తాము స్థాపించిన పార్టీలనే వదిలేసి మరోపార్టీలో చేరలేదా ? ఆహారం (సంపాదన) దగ్గరా అధికారం(పదవి) దగ్గరా సిగ్గుపడకూడదనే  సామెత గుర్తు చేస్తాడు.  పదవికోసం సిగ్గులేని గాడిద లాగా పరుగెత్తావెందుకురా అంటే నా కడుపు కక్కుర్తి నీకేమి తెలుసు అంటాడు.పూర్వం రాజకీయ వ్యబిచారమనే పేరు ఇప్పుడు ఆకర్ష్ గా మారింది.రాజకీయ విటులను రకరకాల ప్రలోభాలతో ఆకర్షిస్తున్నారు.పార్టీ మారటమే  ప్రజాస్వామ్య రక్షణకు ఉత్తమ విధానమని వ్యాఖ్యానాలూ చేస్తున్నారు. గోడదూకటం తప్పనే వాళ్ళూ అక్కడక్కడా ఉన్నారు. జయపాల్ రెడ్డి పాడెమోసిన కర్ణాటక స్పీకర్‌ రమేష్‌ ముగ్గురు రెబెల్ ఎమ్మేల్యేలు 2023 వరకు పోటీ చేయటానికి అనర్హులని ప్రకటించి రాజీనామా చేశారు. ప్రమాణ స్వీకారానికి ముందు ఎమ్మెల్యేలు గోడలు దూకినా ఫిరాయింపుల నిషేధ చట్టం వర్తించబోదన్న ప్రమాదకర వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చబట్టి సరిపోయింది.బలనిరూపణ ఘట్టాన్ని ప్రత్యక్ష ప్రసారం చెయ్యాలని ఆదేశించి ప్రజాస్వామ్యాన్ని గెలిపించింది.ఈ ఊసరవెల్లుల భరతం పట్టే మార్గదర్శకాల క్రోడీకరణ జరగాలి.లేకపోతే   పదవులకోసం  పార్టీలు మారే  ఫిరాయింపుదారులు ఆగరు.ప్రజాతీర్పుపై దుర్రాజకీయాల దండయాత్ర చేస్తూనే ఉంటారు.
--నూర్ బాషా రహంతుల్లా , విశ్రాంత డిప్యూటీ కలక్టర్,6301493266 

20, సెప్టెంబర్ 2019, శుక్రవారం

అప్పిచ్చి చూడు అప్పు చేసి చూడు


అప్పిచ్చి చూడు అప్పు చేసి చూడు
ఏవిధమైన అప్పైనా చేయవచ్చని కేంద్ర ఆర్ధికమంత్రి సెలవిచ్చారు.పోయిన ఎలక్షన్లప్పుడే  ఒకవ్యక్తి ఎన్నికలఖర్చులకోసం బ్యాంకు అప్పు అడిగాడు.ఇప్పుడు మంత్రిగారి ప్రకటనతో అప్పులడిగేవాళ్ళు రెచ్చిపోతారేమోనని బ్యాంకుల మేనేజర్లు భయపడిపోతున్నారు.మిగతా బ్యాంకుల్లో చేసిన పాత అప్పులు తీర్చటానికి అప్పులు అడుగుదామని కొందరు సమాయత్తమౌతున్నారు.అప్పులు చేసి ఎగ్గొట్టి పారిపోటానికి విజయమాల్యా,నీరవ మోడీ లను ఆదర్శంగా తీసుకొని కొందరు ప్లాన్లు వేస్తున్నారు.అప్పులు వసూలు చేసుకోలేక కొందరు,అప్పులు తీర్చలేక ఎందరో ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు.అప్పు చేసయినా  సరే నిప్పంటి సారా తాగాలి అనే దేశనాయకులకు ఇవేమీ పట్టవు.
అప్పిచ్చే వాడు, వైద్యుడు, ఎప్పుడూ ఎడతెగకుండా పారే ఏరూ, ద్విజుడూ ఉన్న ఊళ్ళో మాత్రమే ఉండమని ఒక మతిమంతుడు సలహా ఇస్తాడు. ఎందుకంటే తీసుకున్న అప్పు తిరిగి తీర్చలేనప్పుడు, అప్పు ఇచ్చినవాడు పట్టుకొని అప్పచ్చి అయ్యేలా చితకబాదితే, తగిలిన దెబ్బలు నయం చేయటానికి వైద్యుడు కావాలట. జరిగిన అవమానం భరించలేక వైద్యుడి  దగ్గరకు కూడా వెళ్ళటానికి మనసొప్పకపోతే దూకి చచ్చిపోటానికి, దూరంగా కొట్టుకుపోటానికి అలా ఎప్పుడూ రాత్రిమ్ బగళ్ళు ఎడతెగకుండా పారే ఏరు ఉండాలట. ఒకవేళ దూకినప్పుడు ఎవరైనా చూచి ఒడ్డుకు చేర్చి వైద్యుడి  దగ్గరికి తీసికెళ్ళినా బ్రతక్కపోతే లేక దూకి చచ్చినాక శవమై దొరికితే అంత్యక్రియలు జరపటానికి ద్విజుడు కావాలట. మరి ఇంత ముందు చూపుతో సలహా ఇచ్చిన మహనీయుడెవరో గాని మహా అప్పారావే అయ్యుంటాడు.
అప్పిచ్చి చూడు, ఆడపిల్లనిచ్చి చూడు అన్నారు. అప్పు చెయ్యటమే గాని తీర్చటం ఎరుగని వాడికి వైద్యుడు ఏ మందు వేసీ బాగు చేయలేడు. అప్పులిచ్చిన వాళ్ళు ఏరులాగా ఎదురైనా వాడు ఎదురీది గెలుస్తాడు. అప్పు లేకపోతే ఉప్పు గంజైనా మేలు, అప్పు లేకపోవటమే ఐశ్వర్యం అని చెప్పటానికొచ్చిన ద్విజుడికి కూడా అప్పు చేసి పప్పు దప్పళం లాగించమని తప్పుడు పాఠాలు చెబుతాడు. అప్పు ఎలా ఎగ్గొట్టాలో, అప్పులిచ్చిన వాళ్ళ నుండి ఎదురయ్యే ముప్పులు ఎలా తప్పించుకోవాలో సవివరంగాఅప్పుల అప్పారావు సినిమాలో  బోధిస్తాడు. అప్పుపత్రానికి ఆన్సర్ ఉందిగాని చేబదులుకుందా ? అంటాడు. అప్పు ఎగ్గొట్టటం తప్పురా అని చెబితే ఫలానా వాడి అప్పు తీర్చటం కోసం ఇంకో అప్పు ఇవ్వమంటాడు. ఆ అప్పుల కాపును ఒప్పించటంకంటే తప్పించుకు తిరగటమే గొప్ప పని. అసలు వాడి ముఖం కూడా అప్పు తీసుకునేటప్పుడు అమృత పానం చేస్తున్నట్లు, అప్పు తీర్చే సమయంలో రక్తదానం చేస్తున్నట్లుగా మారిపోతుంది.
తప్పించుకు తిరగటం అంటే గుర్తుకొచ్చింది. అప్పిచ్చే వాడొకడు ఊళ్ళో ఉండి తీరాలని సెలవిచ్చిన అప్పారావే అప్పు తీర్చలేకపోతే తప్పించుకు తిరగమని బోధించాడు. అది కూడా ఎలా ? అప్పిచ్చిన వాణ్ణి నొప్పించకుండా, తాను ఇబ్బంది పడకుండానట. అది ఎలా సాధ్యం అని చప్పరించకండి. అప్పిచ్చిన వాడికి సదా కనబడుతూ నేనిప్పట్లో నీ రుణం తీర్చలేను బాబాయ్ అని చెప్పుతూ పోతుంటే వాడు తప్పని సరిగా బాధపడతాడు. చెప్పు తీసుకొని కొట్ట లేనంత సాధు స్వభావుడైతే పెద్దమనుషుల్లోకి లాగుతాననో, కోర్టు కీడుస్తాననో చెబుతాడు. అది ఇద్దరికీ బాధేగదా ? సరే ఒకవేళ అతని అప్పు తీరుస్తానని మాట ఇద్దామా ఆంటే ఇంకో చోట అప్పు (రుణార్ణము) చెయ్యాలి. ఇప్పటికే అయ్య సంగతి ఊళ్ళో గుప్పుమని ఉప్పుకల్లు కూడా పుట్టని రోత పరిస్థితి ఉత్పన్నమైనందున ఈ పని తప్పకుండా తనకు బాధాకరమే అవుతుంది. అందుకే అప్పిచ్చినవాడు ఆ వీధి గుండా వస్తుంటే ఈ వీధి గుండా పరుగెత్తి మాయమైపోవటం మంచి పని అని అప్పారావు గారి అభిప్రాయం. అలా వీధులు మారుస్తుంటే అప్పు అడగటానికి కొత్త కాపులెవరైనా ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుందట.
అప్పు ఇచ్చి అవతలి వీధి అరుగు మీద కాచుకుని కూచున్న అప్పన్న దీక్షితుల వారు దగ్గరకు పిలిచి ఏమోయ్ అప్పారావ్ ఏదన్నా గొప్ప సంగతి ఉంటే చెప్పవోయ్ ఆంటే అన్ని దానాలలోకెల్లా అప్పు దానం(నీళ్ళువ దులుకోవటం) మేలుఅంటాడు. వీడికి తోడు బోయిన మరో అప్పారావు ఎదురై ఏమిటీ చెయ్యటం ఆంటే అన్ని దానాలలోకెల్లా నిదానం శ్రేష్టంఅంటాడు. అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా పాట రాసినాయనకూడా ఉన్న చోట తెచ్చుకొనుట లేనివారి హక్కురా,అందినంత అప్పు చేసి మీసం మెలి తిప్పరా అన్నాడు.అప్పటినుండి ఈ అప్పుల పురాణం అప్రతిహతంగా సాగుతూనే ఉంది.

రాణివాసం వచ్చి మూలవాసం పీకినట్లుగా ఉండకూడదని అప్పులు,మాంద్యం మీద ఆర్ధిక వేత్తలు  సలహాలిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అప్పులు చేయడం తప్పు కాదని కేసీఆర్ అసెంబ్లీ లో అన్నారు. దేశమే 82 లక్షల కోట్లు అప్పులు చేసిందని,21 రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ అప్పులు చేయడం లేదా? అప్పులు చేయకుండానే ఆ రాష్ర్టాలు పాలన కొనసాగిస్తున్నాయా? మా పరిమితికి లోబడి అప్పులు చేస్తున్నాం. అప్పులు తీసుకోవడం బడ్జెట్‌లో భాగం. అభివృద్ధి చెందుతున్న అమెరికా, జపాన్ దేశాలు కూడా అప్పులు చేస్తున్నాయి.అని కేసీఆర్ కూడా నిర్మలా సీతారామన్ కు వంతపాడుతూ ప్రతిపక్షాల నోరు మూయించారు.అసలు కంటే వడ్డీ ముద్దన్నట్లు స్వదేశంలో కంటే విదేశాలకు అప్పులు ఇవ్వడానికే చైనా బ్యాంకుల మొగ్గు చూపుతున్నాయట.ఈ మర్మమేమిటో మనవాళ్ళూ గ్రహించాలి.
--- నూర్ బాషా రహంతుల్లా

విశ్రాంత డిప్యూటీ కలక్టర్ 6301493266 
 https://www.facebook.com/photo.php?fbid=2675417732490200&set=a.233025936729404&type=3&theater

17, సెప్టెంబర్ 2019, మంగళవారం

చావుకే చావొస్తే ?

చావుకే  చావొస్తే ?
ఈ ఏడు మరణం చాలామందిని లాక్కెళ్ళింది. గత 9 నెలల్లోనే  విజయ బాపినీడు,అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్,జగనాధ మిశ్రా,జయపాల్ రెడ్డి, షీలా దీక్షిత్, విజయనిర్మల, గిరీష్ కర్నాడ్,జార్జ్ ఫెర్నాండెజ్,కోడెల శివప్రసాదరావు, ఇంకా మన దృష్టికిరాని ఎందరో ప్రముఖులు చనిపోయారు. క్యాన్సర్ తో కొందరు,ఆత్మహత్య చేసుకొని కొందరు,కోమాలో  కొందరు,ప్రమాదాలలో కొందరు,ఏదో ఒక రూపంలో ఈ జీవిత సాగరాన్ని దాటారు.మరణానికి ఎన్నో రూపాలు ఉన్నా  ఆత్మహత్య రూపంలో పొందిన ఇచ్చామరణాన్ని ,బలవన్మరణాన్ని, మనిషి సరైన మరణంగా అంగీకరించలేడు.పైగా మహా మృత్యుంజయ మంత్రాన్ని రోగి చెవిలో చెప్పీ చెప్పీ బ్రతికించాలని ప్రయోగాలు చేస్తున్నారు .
మన మత ధర్మ శాస్త్రాలు ఆత్మ హత్యను మహాపాతకంగా వర్ణిస్తాయి. అది ఎందుకు మహాపాతకమో చెప్పమంటే మత గ్రంధాలలో అలా ఉంది కాబట్టి పాతకమే అంటారు.ఆత్మహత్య అంటే  ఇచ్ఛా మరణమే. పూర్వం  ఐ.పి.సి.309 సెక్షన్ ప్రకారం ఆత్మహత్యా ప్రయత్నంచేసి బ్రతికినవారిపై కేసులు పెట్టేవారు. సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రకారం ఆత్మహత్యాయత్నం నేరం కాదు.తీవ్రమైన నిరాశ నిస్పృహలతోనే ఆత్మహత్య చేసుకోవాలని ఎవరైనా భావిస్తారు. వారికి కావలసింది సహాయం కానీ శిక్ష కాదు అని న్యాయస్థానం స్పష్టం చేసింది.పురాణాల్లో మరణం లేకుండా వరాలు అడిగారు.కానీ ఇప్పుడు ఏదో ఒక కారణంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.ఇచ్చామరణమైనా,బలవన్మరణమైనా రెండూ మరణాలే.ఆత్మహత్యలకు ఎన్నో కారణాలున్నాయి.
ఏసుక్రీస్తును శిలువపై బలి ఇచ్చారు.ఆయన మృత్యుంజయుడు కాబట్టి ఆత్మ,హత్య అనే ప్రసక్తి రాలేదు. అయితే ఆత్మహత్యలను ఆపటానికే బతికియున్న శుభములు బడయవచ్చు , బతికుంటే బలుసాకు తిని బతకొచ్చు,చచ్చిన సింహం కంటే బతికున్న కుక్క మేలు,చచ్చి ఏం సాధిస్తావు? లాంటి మాటలు పెట్టుకున్నారు పెద్దలు.చావునుకోరే కొందరు జ్నానులు మాత్రం చావే నయం,చావంటే మోక్షం.చావంటే శరీరమనే పంజరం నుండి ఆత్మకు విడుదల. చావువల్ల చావని ఆత్మకు విడుదల.చావు వచ్చినందుకు సంతసించాలి.ఏడుస్తారు ఎందుకో వెర్రివాళ్ళు అని ఆశ్చర్యపరుస్తున్నారు కొందరు వేదాంతులు.పైగా విషంతాగి,ఉరివేసుకొని,రైలుకిందపడి,శరీరాన్ని హింసించుకొని చావనక్కరలేదు.ఎంచక్కా  భీష్మాచార్యుడి  లాగా మనం కోరుకున్న సమయానికి బాధలేని సునాయాసంగా ఇచ్చామరణం పొందవచ్చు అని కొందరు అంపశయ్యాసనాలు ప్రతిపాదిస్తున్నారు.కొంతమంది వివేకానంద స్వామి మార్గంలో వెళితే కపాలమోక్షం పొందవచ్చని,పోతులూరి వీర బ్రహ్మగారి లాగా సజీవ సమాధి అయితే ఏకంగా వీరభోగవసంతరాయుడి  పరంపరలో అవతరించవచ్చనీ కలలు కనిపిస్తున్నారు. మొత్తం మీద చాలామంది బాధలేకుండా చనిపోవాలని కోరుకుంటున్నారు.అటువంటి సునాయాసమరణం పొందగల తెలివితేటలు డాక్టర్లకే సాధ్యమనే నమ్మకంతో వారిచావుల వైనం వైపు చూస్తున్నారు గానీ వాళ్ళుకూడా విషపు ఇంజక్షను,ఉరి,లాంటి మామూలు జనం వాడే పద్ధతుల్నే వాడుతుండేటప్పటికి  చూశారా? డాక్టర్లు కూడా నొప్పిలేని మరణాన్ని ఇంతవరకూ కనుక్కోలేకపోయారు,మరణం మనిషి చేతిలో లేదు.దేవుడు అనుమతిస్తేనే మనిషి చస్తాడు తెలుసా? అంటున్నారు.ఉమాసుందరి సినిమాలో ఎన్టీఆర్ తో నాగభూషణంలాగా  వెర్రివాడా నీ చేతిలో ఏముంది?అంతా మాయ.నువ్వుచావాలనుకున్నా చావలేవు అంటారు. అబ్బబ్బ నాచావుకు నీ అడ్డేమిటి? అంటే  మళ్ళీ తప్పుదారిలో పడిపోతున్నావు తమ్ముడూ,శివాజ్నలేనిదే చీమైనా కుట్టదు అని హితోపదేశం చేస్తారు. 

ధ్యానంసర్వరోగనివారిణి,ధ్యానం వల్ల ముసలితనం రాదు,ఇష్టమొచ్చినన్నాళ్ళు యవ్వనుల్లా  బ్రతకొచ్చు.మీకు ఎంతకావాలంటే అంత ఆయుష్షు ,జరామరణాలు ధ్యానం చేతిలో ఉన్నాయి అని కొందరు స్వాములు చెబుతుంటే వాళ్ళ దగ్గర ఒక రాజకీయ నాయకుడు చేరాడట. ధ్యానం తో భావోద్రేకాల మీద నియంత్రణ వస్తుందనీ ఎవరేమి తిట్టినా కుంగిపోరనీ ఆత్మహత్య చేసుకోరనే బోధవిని కఠోర  ధ్యానం చేసి దాని  ప్రభావంతో  ప్రత్యర్ధులు తిట్టినా రెచ్చిపోక ,అభిమానులు పూలదండలేసి పాదపూజలు చేసినా పొంగిపోక సూక్ష్మశరీరియై  ఆత్మలాగా త్రిలోక సంచారం చేస్తూ బ్రహ్మానందాన్ని పొందాడట. గత జన్మలలోకి వెళ్ళి తానెవరో చూసుకున్నాడట. ఇక అప్పుడు ఈ జరాదుఖాలతో కూడిన మానవ లోకం కంటే  ఆత్మల లోకమే  బాగుంది.అక్కడైతే నాకు శత్రువులుండరు,ఓటర్లకు సారాయి పోయించనక్కరలేదు,ఇంతమంది చేత ఇన్ని తిట్లు తిననక్కరలేదు. ఆ స్వర్గలోకంలోకి నన్ను పంపిస్తావా గురుదేవా అని అడిగాడట. ధ్యానమనేది బొందితో స్వర్గంనాయనా,నీవు శరీరంతో ఇక్కడే ధ్యానం చేస్తూ  సూక్ష్మరూపంలో స్వర్గానికెళ్ళి అక్కడ విహరించటం నయంకదా? అయినా కాయాన్ని వదలటానికి పరమాత్మ నిర్దేశించిన కాలంవరకు ఇక్కడ బ్రతకవలసిందే చనిపోకూడదు అన్నాడు గురువు.చచ్చి స్వర్గానికెళ్ళాలి అనే కోరిక ఎలా తీరాలి? చావటంకూడా పెద్దపనే.అదంత తేలికగాలేదు.చచ్చినట్లు కలగన్నా ధ్యానం చేసినా మేలుకోక తప్పటంలేదు.చావాలని సన్యాసం తీసుకున్నా గంతా బొంతా  కలిపి గాడిద మోతంత అవుతుందట.ఇప్పుడు అసలే కార్పోరేట్ సన్యాసమాయే!మాకు చావెట్లా వస్తుంది దేవుడా అని తలలు పట్టుకుంటున్నారు.తేలికగా చచ్చిపోలేని బ్రతుకులో ఇరికించి తీరుబడిగా చంపుతున్నందుకు దేవుణ్ణి తిట్టిపోస్తున్నారుకూడా.తరువాత అయ్యో తిట్టానని కోపపడమాకు స్వామీ అని బ్రతిమిలాడుకుంటున్నారు.మొత్తానికి జీవుల మోక్షం దేవుడి ప్రాణానికొచ్చినట్లుంది.పైగా రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే అంటారు కానీజరుగుతున్న సంఘటనలు చూస్తే  రెండూఉన్నాయనిపిస్తోంది.హత్య చేసినవారూ,హత్యకు గురైనవారూ,ఆత్మహత్య చేసుకున్నవారూ,ఆత్మహత్యకు ప్రేరేపించినవారూ,పదునైన విమర్శలతో అవతలివాళ్ళను ఎండగట్టినవాళ్ళూ, తట్టుకోలేక ఎండిపోయినవాళ్ళూ,ఏదోరకంగా,రకరకాలుగా మనుషులు కడతేరుతూ,కడతేరుస్తూనే ఉన్నారు.అన్యాయంగా హత్యకు గురైన వాళ్ళకు,తగిలిన బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకైనా ముక్తి మోక్షం వచ్చాయో లేదో వస్తాయో లేదో ఎవరికీ తెలియదు.పేదవాడిని చచ్చేదాకా వైద్యుడు వదలటం లేదు,చచ్చాక బాకీలు వదలటం లేదు.కోమాలో ఉన్నరోగులకు సేవ చేయలేక, వారి అవస్థ చూడలేక  కన్నబిడ్డలే అమ్మా చచ్చిపోవే అనుకుంటున్నారు.ఈ చావుకే చావొస్తే బాగుండు!

---నూర్ బాషా రహంతుల్లా,విశ్రాంత డిప్యూటీ కలక్టర్,6301493266

 https://anchor.fm/nalinimohankumar-kalva/episodes/ep-e5eato?fbclid=IwAR0trlCwrQpDGSe89Bnr0SUJxIoKZ17DT8jwOLNB3A0Vfm0RLZTYbNArVLQ