దేశమంటే మట్టా? మనుషులా ?
దేశభక్తి తమ తాతల ఆస్తి అని చెప్పుకునే ఒక మూక “ దేశమంటే మట్టేనని ఘంట మోగించి
చెబుతున్నారు. “దేశమంటే మట్టి కాదు మనుషులు” అని చెప్పిన గురజాడ గుడ్లు వెళ్లబెట్టి
చూస్తున్నాడు.
“ ఈ మట్టిలోనే పుట్టాము. ఈ మట్టిలోనే పెరిగాము. ఈ మట్టిని
మించిన దైవం మనకు వేరే లేదురా “ అని వాళ్ళు గట్టిగా పాటలు గూడా పాడుతున్నారు. “నీ
తల్లి నిన్ను నవమాసాలే మోసింది. కానీ ఈ తల్లి (భూమి) నిన్ను కడదాకా, నీ కట్టే కాలేదాకా మోస్తుంది రా “ అనే చరణాలు అందుకొంటున్నారు.
మంత్ర జలం కంటే మంగలి జలమే మంచిదనే వాళ్ళు ఈ మట్టి భక్తులకు
నచ్చటం లేదు. పైగా మట్టి కోసమే గట్టి పోరాటాలు జరుగుతున్నాయి. తెలుగు వీర లేవరా
అని ఒకాయన అంటే తమిళ కత్తి పట్టరా అని మరోకాయన,
మరాఠీ తట్ట ఎత్తరా అని ఇంకొకాయన వాదులాడుకొంటున్నారు. ఎవడు వాడు ఎచ్చటి వాడు ఇటు వచ్చిన
దొంగవాడు అని మన మట్టి మీదే ఎల్లలు గీచుకున్నారు.
పూర్వం ఒక మహానుభావుడి అభిప్రాయం అడిగితే “ నేను ప్రపంచ
పౌరుణ్ణి, ప్రపంచమే నా దేశం “ అన్నాడట. అంతే,అతన్ని పెద్ద దురాక్రమణ దారుడిగా లెక్కగట్టి అసలతనికి దేశభక్తే లేదు
పొమ్మన్నారట మన మట్టి పూజారులు. అతని వాదం ఏమిటంటే “ నేనివ్వాళ్ళ
ఇక్కడున్నాను. రేపు పరలోకంలో ఉంటాను. అప్పుడు అదే నా దేశం. ఈ లోకం కేవలం ఒక మజిలీ
మాత్రమే. ఇక్కడ నా చిరునామా తాత్కాలికమేగదా!” అని.
ఎడారి నేలను పట్టుకొని పాలు తేనెలు ప్రవహించే దేశమని, నీళ్ళు అందక పంటలు ఎండిపోతుంటే సస్యశ్యామలమనీ కీర్తించే
వాళ్ళకు వాస్తవ దృక్పధం లోపించింది అనుకోవచ్చు. కానీ పక్క దేశాలలోని భూమిగూడా
తమదేనని పాడుకొనే అఖండవాదులను విశ్వజనీన హృదయం గలవాళ్ళు ఎలా నోళ్ళు మూయించగలరు ? వాళ్ళ ధోరణి గిట్టనివాళ్ళు మరగుజ్జు మహావృక్షమెక్కి అరచినా
మరగుజ్జుగానే ఉంటాడని అంటారు. పొట్టివాడి నెత్తి పొడుగువాడు గొడితే,
పొడుగు వాడి నెత్తి దేవుడు కొట్టడా అని తిట్టి పోస్తు న్నారు.
మట్టికి మొక్కేదా మల్లయ్యా ? అంటే మరి ఎవరికి మొక్కుతావు చెల్లయ్యా
! అంటూ సుప్రీం కోర్టులో వందేమాతర గీతం గురించి పెద్ద యుద్ధం జరిగింది. ఆ మధ్య
దేవుడికి తప్ప మరి దేనికీ మొక్కేదిలేదని కొందరు పిల్లకాయలు మొండికేశారు. పిల్లల్లారా, ఈ గీతంలో మీరు మన భూమిని తల్లిగా భావించి ఆరాధిస్తున్నారు.
భూమి పూజ చేయటంలో తప్పు లేదు.అది మాతృపూజ లాంటిదే.గొప్ప గొప్ప నాయకులే ఈ పని
చేస్తున్నారు మీకేం వచ్చింది పొయ్యేకాలం? అన్నా ఆ గడుగ్గాయలు
వినలేదు.ఆ పాటకు మా నోళ్ళు తెరవమంటే తెరవమని మొసలిపట్టు పట్టారు. చివరికి
ఎలాగో సుప్రీంకోర్టోళ్ళు బర్రెను కుడితి తొట్టి దగ్గరకు
తీసికెళ్లగలంగాని దానిచేత త్రాగించలేము గదా అని మట్టి భక్తులకు సర్ది చెప్పారు. “
పిల్లలు అందరితోపాటు గౌరవంగా లేచి నిలబడ్డారు. అంతే చాలు, బలవంతంగా వాళ్ళ నోళ్ళు తెరిపించడం, తర్వాత పాడించటం మన రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛను (అంటే
నోరు తెరవటానికి గాని, మూయటానికి గాని భారతీయుని కివ్వబడిన స్వేచ్ఛను) హరించటమే” నని
తీర్పు చెప్పారు.
ఇక
జనగణమన గీతం గురించి కృష్ణస్వామి వారియర్ అనే కేరళ ప్రధానోపాధ్యాయుడు ఇలా
వాదించారు : “ వంగభాషలో రాసిన గీతం దేశమంతా పాడరు. జాతీయ గీతం జాతీయ బాషలోనే ఉండాలి.
హిందీ గాని బెంగాలీ కాని జాతీయ భాషలు కావు, సంస్కృతం మాత్రమే జాతీయ భాష. జాతీయ
గీతం జాతిని లేదా దేశాన్ని కీర్తించాలి కాని ఈ 'జనగణమన' జాతి అధినాయకుణ్ణి, దేశపాలకుడిని మాత్రమే కీర్తిస్తున్నది. జాతీయ గీతంలో మనదేశ భూభాగాలే
కీర్తించబడాలి. అన్ని భూభాగాలకు సమానమైన వర్ణన చేయాలి. అంటే పంజాబ్, సింధు లాంటి పరదేశ భాగాలను విసర్జించి, ద్రావిడ భూభాగాలను విడివిడిగా విపులంగా
వర్ణించాలి”.ఆయన తన స్కూల్లో చదువుకునే
పిల్లలు ఆ గీతం పాడకుండా నోళ్ళు మూయించాడు.
మచ్చాలు తినే నోటికి సొచ్చాలు ఎట్లా వస్తవి
? అని ఆయన ప్రశ్నిస్తుంటే పాలకులు మట్టి దిన్న పాముల్లాగా
ఉంటున్నారు. మంత్రసాని పని ఒప్పుకున్నాక ఏది వచ్చినా పట్టాలి!అని సుప్రీంకోర్టును
ఆడిపోసుకుంటున్నారు. ఈ గడ్డ మీదనే కదిరి కరువొచ్చి మట్టి తిని
చచ్చిపోతున్న వాళ్ళకు మాత్రం ఈ “మన్ను పూజ పోరాటం” గురించి ఏమీ తెలియదు. బెల్లం ఉందని మోచేతి దాకా నాకితే, మోచేతి దాకా మట్టి మాత్రమే తగిలినట్లుంది పరిస్థితి. ఊరు విడిచి వాడ విడిచి ఎంత దూరమేగినా, సొంతఊరు అయినవారు అంతరాన ఉందురోయ్
అన్నట్లు
అద్వానీ కి లాహోర్ పైనా , నవాజ్ షరీఫ్ కు అమృతసర్ పైనా పసితనపు మోజు పోదు.అఖండ భారత గాయనీమణులు నూర్జహాన్ (పాకిస్థాన్), రూనా లైలా (బంగ్లాదేశ్) లతామంగేష్కర్ (ఇండియా) మూడు దేశాలకు చీలిపోయారు.జన్మభూమి ముద్ర పసితనం లోనే మనసుపై పడుతుంది. అది ఎదలోపల మమకారంగా ఏర్పడి జన్మంతా ఉంటుంది.కారణం తనకు పసితనం లో ప్రేమ పంచిన వాళ్ళంతా ఆ ఊళ్ళో ఉండటమే. తనకు అక్కడ పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోయినా సరే. పుట్టిన ఊళ్ళో మట్టి వాసనకు మనిషి పులకిస్తాడు.ఆ ఊరు,ఆ గాలి, ఆ నీరు తో తెలియని అనుబంధం.ఈ అనుబంధాలు మట్టితోనే కాక దానిపై మనతోపాటు కలిసి నివసించే మనుషుల ద్వారానే ఏర్పడుతున్నాయని మనం తెలుసుకోవాలి.
అద్వానీ కి లాహోర్ పైనా , నవాజ్ షరీఫ్ కు అమృతసర్ పైనా పసితనపు మోజు పోదు.అఖండ భారత గాయనీమణులు నూర్జహాన్ (పాకిస్థాన్), రూనా లైలా (బంగ్లాదేశ్) లతామంగేష్కర్ (ఇండియా) మూడు దేశాలకు చీలిపోయారు.జన్మభూమి ముద్ర పసితనం లోనే మనసుపై పడుతుంది. అది ఎదలోపల మమకారంగా ఏర్పడి జన్మంతా ఉంటుంది.కారణం తనకు పసితనం లో ప్రేమ పంచిన వాళ్ళంతా ఆ ఊళ్ళో ఉండటమే. తనకు అక్కడ పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోయినా సరే. పుట్టిన ఊళ్ళో మట్టి వాసనకు మనిషి పులకిస్తాడు.ఆ ఊరు,ఆ గాలి, ఆ నీరు తో తెలియని అనుబంధం.ఈ అనుబంధాలు మట్టితోనే కాక దానిపై మనతోపాటు కలిసి నివసించే మనుషుల ద్వారానే ఏర్పడుతున్నాయని మనం తెలుసుకోవాలి.
“దేశమా! నీవు మట్టివే
అయితే నీపైన నివసించే ఈ మనుషులెవరు ?
నేను ఎవరికి ప్రాముఖ్యతనివ్వాలి ?” అని ఒక కొందరు మేధావులు తలలు చించుకొంటున్నారు. అన్ని
పార్టీల నాయకులు మాత్రం ఓట్ల కోసం మట్టిని
అర్ధించకుండా నేరుగా మనుషుల దగ్గరకు దగ్గరకు వెళ్ళి అడుగుతున్నారు.వారికి తెలుసు
దేశమంటే ఏమిటో!
--- నూర్ బాషా రహంతుల్లా , విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ 6301493266
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి