26, మే 2019, ఆదివారం

దిక్కు లేని ముసలి వాళ్ళు


దిక్కు లేని ముసలి వాళ్ళు
                 పడక మీద తుమ్మ ముళ్ళు పరచె నొక్కడు
              అయ్యో ఇంటి దీప మార్పి వేయనెంచె నొక్కడు
              తల్లీ తండ్రులు విషమని తలచె నొక్కడు
              పడుచు పెళ్లామే బెల్లమనీ భ్రమసె నొక్కడు“
              అయ్యా ఇలాంటి కొడుకులు ఆ తల్లిదండ్రులకు డుగురు ఉన్నారట. ఏం ప్రయోజనం ? ఏడుగురూ తోడు దొంగలై తల్లీ తండ్రిని వాళ్ళ    ముసలితనంలో చూడకుండా హింస పెట్టారట.
              “పది నెలలు నను మోసి పాలిచ్చీ పెంచి
              మదిరోయక నాకేన్నో ఊడిగాలు చేసినా
              ఓ తల్లీ నిను నలుగురిలో నగుబాటు చేసితి
              తలచకమ్మ తనయుని ప్పలు మన్నించవమ్మా”
              అమ్మా, నాన్నా అంటూ ఆర్తనాదాలు చేస్తూ కుంటి వాడై వచ్చిన ఓ   కొడుకు పాండురంగ మహత్యంలో దర్శనమిస్తాడు. పైగా మాతా పిత    పాదసేవే మాధవసేవ అని మరువనంటాడు.
              ఇలాంటి పరివర్తనులందరికీ వారి వారి దుస్థితిలోనే ఙ్ఞానో       దయమయ్యింది. అయితే దుర్మార్గులయిన కొడుకులు కూతుళ్లందరికీ     దుస్థితి ప్రాప్తించటం లేదు. ఙ్ఞానోదయం కావటం లేదు ఎవరో కొందరు   మాత్రమే పశ్చాత్తాపానికీ, ప్రాయశ్చిత్తానికీ ప్రతీకలుగా ఆదర్శనీయులుగా       ఉదాహరణల కోసం నిలబడి ఉన్నారు. మిగతా దుష్టులంతా నిక్షేపంగా        బ్రతుకుతున్నారు.“అమ్మ కడుపులో ఉన్న వాడు, సమాధిలో ఉన్నవాడు      మాత్రమే మంచివాడు” అనే సామెత ఇందుకే పుట్టిందేమో.
పాండురంగని పరివర్తన        
“ఏ పాద సేవ కాశీ ప్రయాగాది పవిత్ర భూములకన్న విమలతరమో            
 ఏ పాదపూజ రమాపతి చరణాబ్జ పూజలకన్న పుణ్యతరమో
ఏ పాద తీర్ధము పాప సంతాపాగ్ని ఆర్పజాలిన అమృత ఝరమో... 
అట్టి పితరుల సేవ ఆత్మ మరచిన వారిని కావగలవారు లేరు ఈ జగాన”
గౌతమబుద్ధుని బోధ
 ఎక్కువ కాలం జీవించిన వారికి, జీవితానుభవం ఉంటుంది. ఎక్కువ జ్ఞానాన్ని కలిగి ఉంటారు.అందుకే వారిని ముందుగా గౌరవించాలి. నివాసం, ఆసనం, ఆహారం, జలం, వస్త్రం లాంటి విషయాల్లో వారికి మొదట అవకాశమివ్వాలి”.పుట్టపర్తి ప్రశాంతినిలయం లోని అన్ని విభాగాలలో ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటిస్తారు.
వృద్ధాప్యం దుర్భరం
ఎవరి సహాయం లేకుండా కాలకృత్యాలు తీర్చుకోలేరు. స్నానం చేయలేరు. తిండి తినలేరు. బట్టలు వేసుకోలేరు. పక్కమీంచి లేవలేరు. కుర్చీమీంచి లేవలేరు. నడవలేరు. బయటకిపోలేరు. వండుకోలేరు. ఇంటిపనులు చేసుకోలేరు. ఉతుక్కోలేరు. మందులు సరిగ్గా వేసుకోలేరు. ఫోన్లు చేయలేరు. ప్రయాణాలు చేయలేరు.ఆర్థిక వ్యవహారాలు చూసుకోలేరు. తమకు తాముకు సురక్షితంగా బతకలేరు.కండరాలు బలహీన పడి కింద పడిపోతారు. లేవమంటే లేవడం, స్నానంచేసి బట్టలేసుకోమంటే వేసుకోవటం, తినమంటే తినడం, ఎవరిదగ్గర ఉండమంటే వారిదగ్గరుండటం వృద్ధుల పరిస్థితి దయనీయం.   
 వృద్ధులు అనుభవాల నిధులు               
ముసలి వారిది ఎవరినీ భయపెట్టని బక్కకోపం.వృద్ధాప్యం ఒక బలహీనత.ఇప్పుడు ముగ్గుబుట్టగా మారిన ఆ తల ఒకప్పుడు ఆలోచనల ఖజానా. వృద్ధాప్యం వల్ల కాళ్లు, చేతులు పట్టు సడలి వణుకుతున్నా లోగడ అవి విరామం లేకుండా శ్రమించాయి. కుటుంబానికి, సమా జానికి ఉపకరించిన శ్రమశక్తి వారిది. వృద్ధాశ్రమాల పేరిట కొన్ని ప్రైవేటు సంస్థలు పక్కా వ్యాపారాలు సాగిస్తున్నాఅడిగే వారు లేరు. ప్రభుత్వమిచ్చే కొద్దిపాటి భృతి, పింఛన్లు, రాయితీలు, ఇతర ప్రయోజనాలు పొందడం కోసం వృద్ధులు నానాపాట్లు పడాల్సి వస్తోంది. పిల్లలు పనుల ఒత్తిడి వల్ల తల్లిదండ్రులతో గడపటం లేదు.వృద్ధులు ఒంటరిగా జీవిస్తున్నారు.అంటే వృద్ధులకు నిర్బంధ వానప్రస్థాశ్రమం తప్పటం లేదు.
ముసలి వాళ్ళను ఎవరు పోషించాలి ?
జన్మ నిచ్చిన తల్లి దండ్రుల్ని వారు సమకూర్చుకున్న ఇంట్లోంచి వెళ్లగొడుతున్న వారు, ఇంట్లోనే ఉంచుకుని  తిండికి మాడ్చే వారు, ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తూ కూడా వారి పోషణకోసం మాత్రం సాయం చెయ్యని వారు,మాటలతో కాలం గడిపేవారు ఎంతో మంది ఉన్నారు.కాబట్టి కన్న బిడ్డలు వదిలేసిన వృద్ధుల పోషణ ఖర్చును కోర్టులు ఇప్పించాలి. దిక్కులేని ముసలి వాళ్ళను వాళ్ళ బిడ్డలే  పోషించాలి. వృద్ధులను దూరంగా ఉంచడమంటే- జాతి నిర్మాతలను దూరం చేసుకోవడమే!
కొన్ని ఆదర్శ పథకాలు
* కేరళ, మహారాష్ట్ర లో వృద్ధుల  ఆరోగ్య సంరక్షణతోపాటు పోషకాహార పంపిణీ, ప్రమాద బీమా పథకాలను అమలు చేస్తున్నారు  
* ముంబాయి లో న్యాయసంబంధమైన కేసుల విచారణలో వృద్ధులకు కోర్టులు  ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు, ఆశ్రమాల ఆవరణల్లోనే అవగాహన శిబిరాలు ఏర్పాటుచేశారు.  
* తెలంగాణలో 'ఆసరా'  పథకం తో వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్నారు .
       * డెన్మార్క్‌, కెనడా, ఐర్లాండ్‌ లు  ఉద్యోగ విరమణ చేసినవారికి నివాస వసతి      కలిగిస్తున్నాయి.  
         1991 అక్టోబరు 1 నుంచి ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తూ వారి సేవలను,వెతలు , వేధింపులు,మస్యలను గుర్తు చేసుకుంటున్నారు. భారతదేశంలో 13 కోట్ల వయోవృద్ధుల జనాభా ఉంది. వృద్ధుల్లో 71 శాతానికి పైగా గ్రామీణ ప్రాంతాల్లో 29 శాతం  పట్టణాల్లో ఉన్నారు. ప్రతి అయిదుగురిలో ఒకరు ఒంటరిగా జీవిస్తున్నారు. వయోవృద్ధుల్లో 51 శాతానికి పైగా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. 2017 ఏప్రిల్‌ నుంచి ప్రవేశపెట్టిన జాతీయ వయోశ్రీపథకం ప్రకారం ముసలివాళ్ళకు  అవసరమైన వాకర్లు, క్రచ్‌లు, కళ్లద్దాలు, వినికిడి పరికరాలు, కృత్రిమ దంతాలు, చక్రాల కుర్చీలు, ట్రైపాడ్లు తదితర సదుపాయాలు కల్పించాలి.  
       దేశ జనాభాలో 11 కోట్ల మంది 60 ఏళ్లు పైబడినవారే. వృద్దుల్లో మహిళల సంఖ్యే ఎక్కువ.భారతీయ వృద్ధుల ఆయుర్దాయం ఇప్పుడు 66.3 సంవత్సరాలు.  ఆరోగ్యపరంగా దగ్గు, అల్సర్లు, కీళ్లనొప్పులు, రక్తపోటు, గుండె జబ్బులు, మూత్ర సంబంధిత వ్యాధులు, మధుమేహం, క్యాన్సర్‌ సోకుతున్నాయి.
ఇంటా బయటా వయోవృద్ధులకు రక్షణ కరువైందని 2015 ఫిబ్రవరిలో సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. వృద్ధాప్యంలో సొంతపిల్లల నుంచి, కోడలు లేదా కొడుకు వద్ద అవమానాలు ఎదుర్కొంటున్నారని  హెల్ప్‌ ఏజ్‌ ఇండియాసంస్థ సర్వేలో వెల్లడైంది. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసినా, పోషణ భారంగా భావించి ఇంటి నుంచి గెంటేసినా, న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయం పొందవచ్చని ఢిల్లీ హైకోర్టు స్పష్టీకరించింది. తల్లిదండ్రులను పోషించాల్సిన బాధ్యత కూతుళ్లపైనా ఉంటుందని 1987లోనే సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. 2021 కల్లా 7.3 కోట్ల మంది వృద్ధ మహిళలు ఉంటారని అంచనా. మన రాష్ట్రంలో 58 లక్షల రిటైర్డ్ ఉద్యోగులున్నారు.
సీనియర్‌ సిటిజన్‌లనుజాతి సంపదగా భావించాలి. తెలుగు రాష్ట్రాల్లో వృద్ధాప్య పింఛన్‌ నెలకు రూ.2000 అందజేస్తున్నారు. దీనిని రూ. 3000 లకు పెంచుతామని హామీ ఇచ్చారు. పెన్షన్ పెంచటం అనేది ఒక గొప్ప సామాజిక సంక్షేమ కార్యక్రమం. వృద్ధులపై దౌర్జన్యాల నిరోధానికి  చట్టం ఉందని చాలామందికి తెలియదు.    
వృద్ధులకోసం ఏమి  చెయ్యాలి ?
* ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో వృద్ధాశ్రమాలను,ప్రతి జిల్లాలో వృద్ధులకు సామూహిక గృహాలను ఏర్పాటుచేయాలి.
* పింఛను రూ.౩౦౦౦ ఇవ్వాలి. ఉచిత ఆరోగ్యకార్డులు అందించాలి
* విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ పై ఆదాయపు పన్ను ఎత్తివేయాలి.జాప్యం చేయకుండా,అవినీతికి ఆస్కారం లేకుండా వారికి రావలసిన పెన్షన్,గ్రాట్యుటీ,జీపీయఫ్ లాంటివన్నీత్వరగా ఇప్పించాలి.పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలి.లంచాలకోసం జాప్యం చేసే వారిని శిక్షించాలి.
*
ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందించాలి. ఆసుపత్రుల్లో వృద్ధుల కోసం ప్రత్యేకమైన వార్డులు ఏర్పాటు చేయాలి. పడకలో ఉన్నవారిని ప్రత్యేకంగా చూసుకోవాలి.
*వయోవృద్ధుల పోషణ పిల్లలే తీసుకోవాలి.కుటుంబ సభ్యుల నుంచి సహకారం తోడ్పాటు దక్కేలా చట్టాలు మార్చాలి.
-- నూర్ బాషా రహంతుల్లా ,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్, 6301493266

1 కామెంట్‌: