పాపం ! పిచ్చి మారాజు
గీటురాయి 5-2-1988
“నీ కోసమే నే జీవించునది
ఈ విరహములో ఈ నిరాశలో
హృదయము నీతో వెడలిపోయినా
మదిలో ఆశలు మాసిపోయినా
మన ప్రేమలనే మరి మరి తలచి
ప్రాణము నిలుపుకొని “ || నీ కోసమే ||
అంటూ జలగం వెంగళరావు గారు ఆపసోపాలు పడుతున్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రం ఒకటో స్థానంలో ఉండేదని మళ్ళి కాంగైకి పట్టం కట్టి గాని తాను మరణించననీ, అసలు తాను బ్రతికి ఉన్నదే అందుకోసమని సెలవిచ్చారు.
ఒకటో స్థానంలో ఉన్న రాష్ట్రం ఈనాడు అధమ స్థానానికి పడిపోవటానికి, రాష్ట్రంలో కాంగై దెబ్బతిని పోవటానికి తెలుగుదేశం ఎంత మాత్రం కారణం కాదట ! నాయకుల అనైక్యతే కారణమట. తమ పార్టీలోని విభీషణుల వల్లనే వాయల్పాడు సీటు కోల్పోయారట.
ఎవరివల్ల చేడ్డావోయి వీరన్నా అంటే నోటివల్ల చెడ్డనోయి పేరన్నా అన్నడట, తమ పార్టీలో విభీషణులున్నారు అని జలగం గారు ఒప్పుకున్నారు. అపర రామభక్తుడైన విభీషణుడి మీద జలగంకు సదభిప్రాయం లేదన్న మాట, తెలుగుదేశపు రాముడిని చూచి అసలు రాముడి పైనే అక్కసు పెంచుకొని రావణుల మీద జలగం వారు మక్కువ పెంచుకున్నట్టుగా ఉంది.
విశాఖపట్టణం పోయి “ ఈ జిల్లాలో వారాడకు ద్రోణంకు సరిపడదు. ఇద్దరూ కలిసి కొంపకు నిప్పు పెట్టారు “ అన్నారు. గాడిద కొడకా అంటే తమరు తండ్రులూ మేము బిడ్డలము అన్నట్లు వారూ సమాధానమిచ్చారు. అనైక్యత అనేది కాంగై జాతి చిహ్నమని, ముఠాకుమ్ములాటలు ఆ పార్టీ అనువంశిక లక్షణమని ఆలస్యంగానైనా జలగం వారికి అవగాహన అయినందుకు ఆనందమే. ఆయా రాష్ట్రాలలోని అయ్యవార్ల జాతకం ఢిల్లీ లోని అధిష్టానా వర్గం అనుగ్రహం మీదనే ఆధారపడి ఉంటుందని అందరికీ తెలుసు. కాంగ్రెస్ లోని అనైక్యత రూపుమాపటం కోసం వంద సంవత్సరాల నుండి వయోవృద్ధులు చేస్తున్న ప్రసంగాలు, ప్రయత్నాలు అన్నీ వ్యర్ధమయ్యాయి. ఎందుకంటే :
కండ చక్కెర పానకము పోసి పెంచినా
ముష్టి చెట్టుకు తీపి పుట్టబోదు
పాల మున్నీట లోపల ముంచి కడిగినా
కాకి రెక్కకు తెలుపు కలుగబోదు
పన్నీరు గంధంబు పట్టించి విసిరినా
తేలుకొండి విషంబు తీయబోదు
వెదురు బద్దలు చుట్టూ వేసి బిగించినా
కుక్క తోకకు వంకర కుదురబోదూ
మంచి మాటల నెంత బోధించి చెప్పినా
మడియ రండకు వీగుణంబు లిడువబోదు
అని శ్రీ పోలిపెద్ది వెంకట రాయుడు చెప్పిన మాటలు అక్షరాల నిజమేననిపిస్తున్నది.
శ్రీకాకుళం వెళ్ళి “ గవర్నర్లు రాష్ట్రాలలో సంక్షోభం సృష్టిస్తున్నారు “ అని కూడా జలగం గారు విరుచుకు పడ్డారు. ఈయన మాటలు పత్రికల్లో రాయమాకండి బాబో అని ఆ ఊరి కాంగై పెద్దలు విలేఖరుల దగ్గర ప్రాధేయపడ్డారు, ఇంకిపోతున్న చెరువుకు కొంగను కాపలా పెట్టినట్లుగా కేంద్రం ఈయన్ని పదవిలో ఉంచిందేమిటా అని కొందరు భయపడుతున్నారు. మొత్తం మీద జలగం పరిస్థితి ఇంటిమీద రాయివేసి
వీపు ఒగ్గినట్లుగా ఉంటున్నది. విభీషణులను చూచి విస్తుపోవటం వ్యర్ధం. రావణుడు మారటం అసంభవం. అందుకని జలగం వారు చెవికింద జోరీగలాగా సొద పెట్టకుండా ఉన్న జోడు పదవులతో సంతృప్తి పడి మౌనంగా ఉండటమే మేలేమో ! అధిష్టాన వర్గం ఆగ్రహిస్తే ఇంటి కూటికీ దోవ కూటికీ రెంటికీ చెడిన వ్యక్తుల జాబితాలోకే జలగం వారు వెళ్ళి పోతారని కాంగైలోని ఆయన ప్రత్యర్ధులు అంటున్న మాట ఆయన కాస్త ఆలోచించాలి.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి