అర్ధం లేని వాదన
ప్రకాశం జిల్లాలోని ఒక ఊళ్ళో
తురకపాలెంలో అద్దెకు ఉన్నాను. అక్కడొక
అమ్మాయికి పెళ్ళయింది. పెళ్లి కూతుర్ని ముస్తాబు చేసి తెచ్చారు. పది మంది అమ్మలక్కలూ చూచి సంతోషించారు. పెళ్లి
కొడుకు తరపున ఒకామె పెళ్లికూతురును
చూచి “అమ్మాయి ముఖం లద్దాఫ్ ముఖంలా ఉంది”
అందట. ఈ మాటతో పెద్ద గొడవ చెలరేగింది. ఇరు వర్గాల వారు గిరిగీసుకుని పోరాటాలకు దిగారు. పెళ్లి ఆగిపోయింది. వారం రోజుల
పాటు ఆ వీధిలో “లద్దాఫ్, లద్దాఫ్”
అనే పదాలు మారుమోగి పోతున్నాయి. నాకు ఉర్దూ
రాదు. ఈ లద్దాఫ్ అనే మాట తప్ప మిగతా మాటలు నాకు అర్ధం కావటం లేదు. సరే నాకెందుకులే అని పట్టించుకోలేదు. నాలుగు రోజుల తరువాత మా ఆవిడ ఉండబట్టలేక ఇంటావిడను సంగతి
ఏమిటని అడిగింది. “అమ్మాయి
ముఖం దూదేకులామె ముఖంలాగా ఉందని ఎవరో అన్నందుకేనమ్మా
ఈ తగాదా” అని ఆమె చెబితే మా ఆవిడ ఆగ్రహానికి అంతులేకుండా పోయింది.
సరాసరి నా
దగ్గరకు వచ్చి “ఏమండీ, తురక వాళ్ళ ముఖాలు బాగుంటాయా? దూదేకులవాళ్ళ ముఖాలు బాగుంటాయా తేల్చండి”
అంది. శ్రీమతి ఇంత విజ్ఞానదాయకమయిన ప్రశ్న వేసేటప్పటికి నేను ఆలోచనలోపడ్డాను.
“దూదేకులవాళ్ళ ముఖాలే బాగుంటాయి అన్నాను తడుముకోకుండా. “మరయితే
ఈ తన్నులాట ఎందుకు?” అని సంగతి వివరించింది. ఇన్ని రోజుల్నుండి జరుగుతున్న యుద్దానికి కారణం ఇంత చిన్న విషయమా అని
ఆశ్చర్యపోయాను. అసలీ భావన ముస్లిం లలో ఎందుకు
చోటు చేసుకుంది ? అన్న ప్రశ్నే నన్ను ఉక్కిరిబిక్కిరి
చేసింది. దోషం ఎక్కడుందీ? దోషం ఇస్లాం స్వీకరించి దాని ఒడిలోకి
వచ్చిన వివిధ కులాలు, తెగలవారికి తగిన శిక్షణ నివ్వలేకపోయిన
ముస్లిం పెద్దలదా? ఇస్లాం
స్వీకారం తర్వాత కూడా తమ మనసుల్లో నుండి ఆత్మన్యూనతాభావాన్ని
తొలగించుకోలేకపోతున్న ‘లద్దాఫ్’ లదా ? లేక ముస్లిములు
తమలోనూ రెండు వర్గాలున్నాయని తలపోస్తున్నారా? ఏమయినా ఈ జాడ్యం ఎంతో ప్రమాదకర మయిందనిపించింది. అవిద్య, అజ్ఞానం మూలంగా వెర్రితలలు వేస్తున్న ఈ
మనస్తత్వాన్ని రూపుమాపే సంస్కరణలు ముస్లిం
సమాజంలో రావాలని, సంస్కారంగల
ప్రతి ఒక్కరూ దీనికోసం చేతనయింది చేయాలని అంతరాత్మ బోధించింది.
ఇరు పక్షాల
పెద్దలనూ సమావేశపరిచాను. ఇద్దరి మధ్య నిలబడి “అయ్యలారా, వారం రోజులనుండి మీ తగాదా వింటున్నాను.
విషయం అర్ధంగాక పట్టించుకోలేదు. అయితే నాకు
మీ తగాదా కారణం ఇప్పుడే తెలిసింది.
లద్దాఫ్ ముఖం అంటే ఏ గ్రద్ద ముఖంలాగానో ఉండదు. అనేక మంది సాయిబుల ముఖాలలాగానే ఉంటుంది. రేపు దేవుని తీర్పు సింహాసనం ముందు మనం నిలబడినప్పుడు ఆయన మన
ముఖాలను పరీక్షించి తీర్పునివ్వడు, మనమెంతటి వినయ విధేయతలు గలవారమో, మన హృదయాలు ఎంత
అందంగా ఉన్నాయో చూస్తాడు. హృదయాలలో ఇంత మురికి పెట్టుకొని అయిదుపూటలా ముఖాలు ఎంతో తేటగా కడుక్కుంటే మాత్రం ప్రయోజనం
ఏమిటి ? మనిషికి భయభక్తులు, సదాచారం సంపన్నత ముఖ్యం. మానవులందరిని సమానంగా చూడటం, సత్క్రియలు చేయటం ద్వారా
హృదయ సౌందర్యం పెరుగుతుంది. తద్వారా మనం ముస్లిములమవుతాము. ముఖం కంటే మనస్సు ప్రధానం. ఆలోచించండి”
అని ఓ లెక్చరిచ్చి వెళ్లిపోయాను. ఏమనుకున్నారో ఏమో తగాదా మట్టుకు ఆగిపోయింది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి