చేవలేని చేను - లేవ
లేని ఆవు
గీటురాయి 24-4-1990
అడుగుటేగాని ఇచ్చుట అసలె లేక
అప్పులెగాని
వనరుల ఆశ లేక
జరుగనున్నది
తెలియక జనులు కుంద
మంత్రి
వర్యుల మాటలన్ మార్పు రాదు
ప్రజల
కోర్కెలు దీర్చెడి ప్రగతి లేదు
ప్రాణ
భయమున కుత్పత్తి ప్రాంతమైన
ఆంథ్రి
నెచ్చట గలదోయి ఆత్మశాంతి ?
అని
ఓ కవిగారు చాలా బాధపడ్డారు. అప్పుడు నేను చెప్పాను : కూతురు చెడితే తప్పు తల్లిదంటారు. మంత్రులు చెడితే ఆ తప్పు జనానిదే. కూరకు తాలింపు, చీరకు జాడింపు,
మంత్రులకు వాయింపు ఉండాలి. లేకపోతే
పాలకులు మన మీద ఏకు మేకై కూర్చుంటారు. కూన అని పెంచితే,
గండైకరవ వచ్చినట్లుగా ప్రవర్తిస్తారు. “పీనిగలపై కప్పే గుడ్డల్ని పట్టు బట్టల్లా
స్వీకరించి శరీరాలపై సింగారించుకునే జీవచ్ఛవాల్లారా, రక్తమోడ్చి సంపాదించిన
ప్రజల కష్టర్జితాన్ని రాబందుల్లా కొట్టేసే దుర్మార్గుల్లారా గుడిగుడి దగ్గరా చెప్పులిడిచి పెళ్ళున చెంపలేసుకుంటే పుణ్యమోస్తుందా ? రాళ్ళకి మొక్కి తీర్ధాల్లో మునిగితే మీ పాపాలు క్షమించబడతాయా ?”
అని సి. వి. గారి లాగా మొహాన అడుగకుండా , ఆత్మశాంతి
లేదని బాధపడితే ప్రయోజనం శూన్యమని చెప్పాను. ఏ మనిషి తో మాట్లాడినా ఏవో బాధలు పెల్లుబికి
వస్తున్నాయే గాని, సుఖశాంతుల సమాచారం
అందటం లేదు.
చెన్నా
గారి పాలనలో నమలక మింగక నానవేసిన రీతిలో సమస్యలు మురిగిపోతున్నాయి.
ఏ పని చెయ్యటానికీ ఆయన వల్లకావటం లేదు. స్వంత
బృందంలోనే అపశకునపు వాదులు తయారయ్యారు. అంతకు మించి
అధిష్టాన వర్గం అదుపు ఎక్కువయ్యింది. అది చేస్తాం ఇది చేస్తాం అనే కూతల ఆర్భాటమే గాని కుప్పలో ఇత్తులు లేవు.
మంత్రులకు మనసులు లేవు,అధికారులకు
ఆదేశాలు లేవు. పుణ్యకాలం కాస్తా వెళ్లిపోతూనే ఉంది. ఏది చేయాలన్న ఢిల్లీకి పరుగెత్తక తప్పటం లేదు.
ఉదాహరణకు కూలిపోయిన వంతెనలు కట్టడం దగ్గర నుండి కొత్త
జిల్లాల సమస్య దాకా,
కోనసీమ, నాగార్జున, నల్లమడ, బాలాజీ, నంద్యాల, గుంతకల్లు,
మంచిర్యాల, మెదక్, ఈ రకంగా ఎన్నో ప్రాంతాల వాళ్ళు కొత్త జిల్లా కోసం
కనబడిన ప్రతి మంత్రినీ యాచించారు. చెన్నారెడ్డి గారు ఎట్టకేలకు మరో 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని మెదక్
శాసనసభ్యునికి హామీ ఇచ్చారు. మరి ఆ
హామీ ఏమయ్యిందో గాని అసెంబ్లీలో రెవిన్యూ మంత్రి
అసలుకే ఎసరు పెట్టారు. కొత్త జిల్లాల ప్రసక్తే లేదు పొమ్మన్నారు. ఖర్చు ఎక్కువ అవుతుందంట. అకాడమీలు,
కౌన్సిళ్ళ ఏర్పాటు మానుకుంటే మరి ఖర్చు తగ్గేది కాదా ? ఇక్కడొక మాట,
అక్కడొక మాట జారవిడుస్తూ, సక్రమంగా ఉన్న ఒక్కొక్క పథకానికీ బొక్కలు పెట్టుకుంటూ పోవడం మినహా చెన్నా పాలనలో కొత్తదనం గాని, అభివృద్ధి గాని ఏమీ లేదు. మండలాలను ముండమోయించి, ప్రజలంతా వద్దు బాబో అంటున్నా వినకుండా తాలూకాలను తిరిగి తెచ్చే
ప్రయత్నం ఆపలేదు. జనం ఎంతగా మొరపెట్టినా
కొత్త జిల్లాల ఏర్పాటుకు పూనుకోవటం లేదు. రెవిన్యూ డిపార్టుమెంటును పంచాయితీరాజ్ తో విలీనం చేసి పంచాయితీల
శక్తిని పెంచాలనే డిమాండును పెడచెవిని
పెట్టారు. పౌరసరఫరాల కోసం ఒక ప్రత్యేక
శాఖను ఏర్పాటు చేసి రెవిన్యూ శాఖపై వత్తిడి
తగ్గించాలనే ప్రతిపాదనను గిరాటేశారు. 805
మంది డిప్యూటీ తహసీల్దార్లను గజిటెడ్ గా ప్రకటించి ప్రజలకు చేరువలో నిజమైన
అధికారుల్ని ఉంచాలనే వాదనను వమ్ము చేశారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి అదుపులో ఉన్నట్లుగానే కలెక్టర్లను,
జిల్లా పరిషత్ చైర్మన్ల అదుపులో ఉంచాలనే ప్రజా
ప్రతినిధుల కోర్కెను కాలదన్నారు.
అసెంబ్లీ లో వీళ్ళ ముచ్చట్లు,వాదులాటలు చూస్తే గుడిపూడి జంగాలు ఙ్ఞాపకం వస్తున్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి