దొంగల్ని కఠినంగా
శిక్షించాలి
గీటురాయి 19-1-1990, 26-1-1990
ఈ మధ్య దొంగతనాలు ఎక్కువ అయ్యాయి. ఆర్.టి.సి. బస్సుల్ని ఆపి ప్రయాణీకుల్ని
దోచుకుంటున్నారు. నగర శివార్లలోని ఇళ్ళలో పడి
దోచుకోవటమే గాక మనుషుల్ని కూడా
చంపుతున్నారు. ఆడవాళ్ళ మెడల్లోని మంగళ సూత్రాలు, బంగారు గొలుసులు తెంపుకు పోతున్నారు. జేబులు కత్తిరిస్తున్నారు. ఇంకా ఎన్నో రకాలుగా
దొంగలు సమాజానికి చీడపురుగుల్లా పట్టి ఉన్నారు. ప్రభుత్వం దొంగతనాన్ని తీవ్రమైన
నేరంగా పరిగణించినప్పటికీ దొంగలకు
పడే శిక్షలు చాలా తేలికగా ఉంటున్నందువల్ల వారిలో
పరివర్తన రావటం లేదు.
పరివర్తన వచ్చిందన్న నెపంతో మన
రాష్ట్రంలోని జైళ్ళలో ఉన్న నేరస్తులను
విడుదల చేయదలిచామని గతంలో ముఖ్యమంత్రి శ్రీ రామారావు
అంటే అప్పటి హోమ్ శాఖ మంత్రి శ్రీ కోడెల శివ ప్రసాదరావు అలా నేరస్తులను విడుదల చేయటం మంచిది కాదని
ఖండితంగా చెప్పారు. కొత్త ప్రభుత్వం
పుణ్యాన విజయవాడ అల్లర్లలో పాలుపంచుకున్న దొంగలు చాల
మంది క్షమాపణ పొందారు. జైళ్ల గోడలు దూకి కొందరు పారిపోయారు. దొంగ తన పొరుగు వాని సంపదను, శ్రమ ఫలాన్ని కాజేసి
సుఖపడాలని చూస్తాడు. అందువలన తన చాకిరీ
ఫలితాన్ని దొంగకు అర్పింపజేసిన మనిషి
ఎంతో నష్టపోతాడు. శారీరకంగా మానసికంగా క్రుంగిపోతాడు. పరమ సోమరిగా బ్రతుక జూచేవాడు దొంగతనాలు చేస్తూ దర్జాగా కాలం గడుపుతాడు. దొంగలను అరికట్టలేకపోతే
నీతిమంతులైన ప్రజల జీవితాలకు, సంపదకు భద్రత లేక దేశంలో ఘోరమయిన అరాచకం, అన్యాయం, దుఃఖం నివసిస్తాయి. కేవలం నీతులు చెప్పినంత మాత్రాన దొంగలు మారరు. కఠినమయిన శిక్షలు ఉంటేనే వారు సక్రమంగా ఉంటారు.
“దొంగతనం చేసిన స్త్రీ పురుషుల చేతులు
నరకండి” అని ముస్లిముల పవిత్ర గ్రంధమయిన ఖురాన్ లో ఉంది. అరేబియా దేశంలో ఈ శిక్ష అమలవుతున్నందున అక్కడ దొంగతనము చాలా తక్కువగా
ఉంది. మనుస్మృతి 8వ కాండము 334 వ శ్లోకం ఇలా ఉంది : -
“యేనయేన యథాంగేనస్తేనో నృషుని చేష్టతే
తత్వదేవ
హరేత్తస్య ప్రత్యాదేశాయ పార్థివ:”
అంటే
ఏ ఏ అవయవాలతో ఒకడు దొంగతనం చేశాడో వాడు ఇక మీదట
అలా చేయకుండేలా వాడి ఆయా అవయవాలను నరికించవలెను.
యూదులకు క్రైస్తవులకు పవిత్ర లేఖనమయిన మోషే
ధర్మశాస్త్రంలో “ఎవడైనా మనిషిని దొంగలిస్తే మరణ దండన
విధించాలి” అని ఉంది. దొంగిలించిన వస్తువు వాడి దగ్గర దొరికితే దానికి రెండింతలు
చెల్లించాలి అని దొంగకు శిక్ష ఉంది. దొంగలించకూడదు అనేది పది ఆజ్ఞలలో ఒకటి.
అయితే
ఈ పాతకాలపు శిక్షలు అనాగరికమైనవనీ, అమానుషము,
ఆటవికమని నేటి నాగరిక న్యాయవేత్తలు
అభిప్రాయపడుతున్నారు. కొందరు అపహాస్యం
చేస్తున్నారు. ఈ విధంగా నేటి న్యాయస్థానాలు, ప్రభుత్వాలు దొంగలకు శిక్షలు తగ్గించి ప్రజలకు ఎంతో కీడు చేస్తున్నాయి. మౌర్య చంద్ర
గుప్తుడు, హర్షవర్ధనుడు పాలించిన కాలంలో
దొంగతనాలు, నేరాలు పూర్తిగా హరించి
పోవటానికి కారణం శిక్షలు అతి కఠినంగా ఉండటమేనని చరిత్రకారులంతా
ఒప్పుకున్నారు. హర్షవర్ధనుని కాలంలో అయితే ఒక బంగారపు
ముద్దను ఎగురవేసుకుంటూ ఒక మనిషి దేశమంతటా సంచరించినా
ఎవ్వరూ దొంగలించటానికి ధైర్యం చెయ్యలేకపోయారట. అనాగరికం అంటూ నాగరికులు
అపహసించే అలాంటి మంచి రోజులు మనకు
వస్తాయా ?
1986
లో మన రాష్ట్ర పోలీసుల మీద ప్రభుత్వం చేసిన ఖర్చు 114 కోట్ల రూపాయలు. దొంగల మీద పోలీసుల పనితనం ఎలా ఉందో
చూడండి : -
|
|
1984
|
1985
|
1986
|
1
|
దొంగతనాల కేసుల సంఖ్య
|
23892
|
21375
|
17965
|
2
|
పరిష్కరించిన కేసుల సంఖ్య
|
11585
|
12443
|
11084
|
3
|
పరిష్కరించిన కేసుల శాతం
|
48.5%
|
58.2%
|
61.7%
|
4
|
దొంగలించబడిన ఆస్థి
|
609.86 లక్షలు
|
695.36 లక్షలు
|
607.45 లక్షలు
|
5
|
తిరిగి స్వాధీనం చేసుకున్న ఆస్థి
|
263.46 లక్షలు
|
400.72 లక్షలు
|
315.92 లక్షలు
|
6
|
స్వాధీనం చేసుకున్న ఆస్థి శాతం
|
43.2 %
|
57.6 %
|
52%
|
పై
లెక్కలు పోలీసు డైరెక్టర్ జనరల్ గారే
ప్రకటించారు. ఈ లెక్కలను బట్టి
పోలీసులకు తెలియజేయబడిన దొంగతనాల కేసుల్లో సగం కేసులు పరిష్కారం కావటం లేదు. దాదాపు ఏడాదికి 300 లక్షల రూపాయలు దొంగలు జేబుల్లోకి పోతున్నట్లు ప్రభుత్వ లెక్కలే
చెబుతున్నాయి. ఇక పోలీసులకు చెప్పకుండా
ఇదంతా మా ఖర్మలే అని సరిపెట్టుకున్న వాళ్ళు ఎంత
మందో వాళ్ళు పోగొట్టుకున్న
ఆస్థి విలువ ఎంతో
ఆ పైవానికే తెలియాలి.
కష్ట
సంపాదన దొంగపాలు కాగా వాడిని పట్టుకోలేక, పోయిన సొమ్ము తిరిగి
రాక ఇది నా ప్రారబ్దం,
కర్మ అని సరిపెట్టుకోవలసిన దుస్థితి నేటి ప్రజలకు
దాపురించింది. దొంగలు సొత్తు దోచుకోవటమే గాక మనుషుల మాన ప్రాణాలను సైతం హరించి వేస్తున్న సంఘటనలు కొల్లలుగా
పత్రికల్లో వస్తున్నాయి. ఊరి బయట, ఊరి లోపల అనే తేడా లేకుండా ప్రతి ఛోటా దొంగలు స్వైర విహారం చేస్తున్నారు. ప్రజలు
భయభ్రాంతులై బ్రతుకవలసిన పరిస్థితులు
దాపురించాయి. దేశ,
రాష్ట్ర ఉత్సవాల సంధర్భంగా నేరస్తులకు క్షమాభిక్ష
పెట్టి మళ్ళీ సంఘంలోకి వదిలి వేస్తున్న మన పాలకులు ఎంత నేరం చేస్తున్నారో, ప్రజల మధ్యకు ఎలాంటి దుష్టులను విడుదల చేస్తున్నారో ఆలోచించాలి. నేరస్తులను క్షమించటం నేరాలను ఉపేక్షించటం
మేలు కాదని గ్రహించాలి.
ప్రత్తి
పంట మీద పురుగుల మందు కోసం,
నగలు తాకట్టు పెట్టి బ్యాంకులో
వడ్డీకి రుణం తీసుకు వెళుతున్న
గ్రామీణ మహిళా రైతు చెంగుముడి నుండి డబ్బు
గుంజుకు పోయిన దొంగ ఎక్కడో సుఖపడుతుండగా, అప్పు ముప్పై
కూర్చున్న రైతు క్రుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి విని నేను దుఃఖపడుతున్నాను. దొంగల బారిన పడిన వారి
కష్టాల కధలు వింటుంటే మనసు కలత
చెందుతుంది. దేశంలో దొంగలు ఉండటం దేశ ప్రతిష్టకు ఎంత
అవమానకరం ? దేశ సౌభాగ్యానికి
ఎంత వినాశకరం ? పట్టుబడిన దొంగలను కఠినంగా శిక్షించకుండా
వదిలి పెట్టడమంటే ప్రజల ఆస్తులు ఏమై
పోయినా పరవాలేదనుకోవటమే. ఎవరి ఆస్తికి వారే కాపలాదారులుగా
ఉండవలసిందే గాని,
ఎవరి ఇంటి మీద వంటి మీద పడిన దొంగల్ని వారే
ఎదిరించు కోవలసిందే గాని ప్రభుత్వం పట్టుబడిన దొంగల్ని శాశ్వతంగా బంధించి ఉంచలేదన్నమాట ! దేశ రహస్యాలను అమ్మి, విదేశీ బ్యాంకుల్లో
డబ్బు దాచి, లంచాలకు
పాల్పడిన కొందరు నాయకులే పెద్ద దొంగలుగా
మారారు. చేతులు నరకటం అంటే అనాగరికమయిన శిక్ష అని అరిచే
నాగరికులు, ఆ శిక్ష సమంజసమో కాదో డబ్బు
పోగొట్టుకుని వ్యధ చెందుతున్న వారిని
అడిగితే చెబుతారు. నష్టపోయిన వాడికి సంతృప్తికరమయిన
న్యాయాన్ని కలిగించేదే సరియైన శిక్ష. ఒక దొంగకు ఎలాంటి
శిక్ష విధించాలో ఆ దొంగ వల్ల నష్టపడిన వాడే చక్కగా చెప్పగలడు. చేతులు
నరకలేకపోయినా, కనీసం దీర్ఘకాలం
జైల్లో ఉంచే ఏర్పాటైనా చేయవచ్చు. నాగరీక
న్యాయం పేరుతో శిక్ష విధించటానికి ఏళ్ళూ వూళ్ళూ గడిపి, జైలులో సకల సౌకర్యాలు అమర్చి, కొంతకాలం తరువాత విడుదల చెయ్యటం వల్ల, దొంగలలో ఎలాంటి సంస్కరణ రాకపోగా, వారు సంఘంలోని కొత్త దొంగలకు ప్రోత్సాహకరంగా తయారవుతున్నారు. అవినీతి, అక్రమ సంపాదనా బుద్ధికి తగిన దండన లేకపోవటం వల్ల కొందరు పోలీసులు కూడా దొంగలకు అంగరక్షకులై ప్రజలు
నిస్సహాయులయ్యారు. న్యాయవాదులు, న్యాయమూర్తులు కూడా నాగరీకపు
మోజులోపడినందువల్ల “దొంగల్ని
కేవలం బెత్తంతో కొట్టి వదలవచ్చు” లాంటి న్యాయ శాసనాలు నిర్మించారు. అలాంటి
శిక్షాస్మృతులు సువర్ణావకాశాలై దొంగలు
క్షేమంగా విరాజిల్లుతున్నారు.
బస్టాండ్లలో, రైల్వేస్టేషన్లలో, సంతలలో “జేబు
దొంగల ఫోటోలు” ప్రదర్శించటంతో
పోలీసులు చేతులు దులిపి వేసుకుంటున్నారు. దీని అర్ధం ఏమిటంటే
ఆయా దొంగల ముఖారవిందాలను ఆసాంతమూ గమనించి వాళ్ళ
నుండి మనల్ని మనమే రక్షించుకోవాలి గాని పోలీసులు ఏమీ మనకు సహాయపడరన్నమాట. దొంగలు అని తేలిన తరువాత వాళ్ళను మళ్ళీ మన మధ్యకు పంపి, మనకు పరిచయం చెయ్యటం, మన జేబులతో చెలగాటమాడటం, ఎంత హేయమో, ఎంత అన్యాయమో ఆలోచించండి. దొంగల ఏరివేతకు, వాళ్ళను దొంగతనం చేయటానికి పనికి
రాకుండా చేసేందుకు వాళ్ళు ప్రజల్లోకి
రాకుండా నిర్బంధించేందుకు,
పోలీసులకు ప్రభుత్వానికి వీలుకాదా ?
ఎందరి
మంగళ సూత్రాలు మాయమయ్యాయి ?
ఎందరి మానాలు ప్రాణాలు మంటగలిశాయి ? ఎంతమంది ఆస్తులు కోల్పోయి అప్పుల పాలయ్యారు ? ఇదంతా ఎవరికి పట్టాలి ? నిస్సంకోచంగా, నిర్భీతిగా వీధిలో నడిచి
రాగలిగే పరిస్థితిని మనకు కల్పించవలసిన బాద్యత ఎవరికి ? దొంగలు, దోపిడీదారులు, హంతకులు, బందిపోట్లు తిరుగుతున్న సమాజంలో
మనకు మనమే రక్షకులంగా ఉండగలమా ?
దేశ ద్రోహులనే పేరుతో టెర్రరిస్టులను
నక్సలైట్లను కాల్చి చంపుతున్న ప్రభుత్వం, ప్రజల ఆస్తులను
దొంగలించి ప్రజాక్షేమాన్ని హరిస్తున్న దొంగలను సంఘ విద్రోహులుగా గుర్తించి వారిని కఠిన శిక్షలు అమలు జరపాలి. దొంగలకు
జైళ్లలోనే పని కల్పించి వారిని ఎన్నటికి
విడుదల
చెయ్యకూడదు. విడుదల అయిన దొంగలు
అనుభవించిన శిక్ష గుర్తులు సంఘానికి కనబడాలి !
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి