ఎద్దేవుడోయటంచు ఎమ్మూలకేగినా ...
గీటురాయి 4-7-1986
“ పదవే పోదాము గౌరి
పరమాత్ముని జూడ
పదవే పోదాము గౌరి “
.
అని తెలుగు ప్రజలు ఇక ఏ గుడికీ పోనక్కరలేదు. తలుచుకుంటే చాలు వచ్చి ఒళ్ళోవాలే ప్రత్యక్ష పరమాత్ముడు మన మధ్యలోనే,పైగా తెలుగు దేశంలోనే ఉన్నాడు.
రాయిని ఆడది చేసిన రాముడా ? గంగను తలపై మోసిన శివుడా ?
ఎవరాయన ? అని నీవు ఎదురు ప్రశ్న వేయొద్దు. ఆయనలో నీవు అందర్నీ సందర్శించవచ్చు. చివరికి నిన్న మొన్నటి వివేకానందుల వారినీ, గాంధీగారిని కూడా !
అసలు రాళ్ళల్లో దేముడుండాడని మనం భ్రమపడుతుంటాం. కానీ ఈ నవయుగ పరమాత్ముని ఇదే విషయం అడిగి చూస్తే “ చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే చిత్తము చెడునురా ఒరే ఒరే ! ఒక్కడైనా ఈ పరమేశ్వరునికి ( అంటే నాకే ) మొక్కి చూడరే అరే అరే !“ అన్నారు.
వెంకటరెడ్డే కంకికొరికితే, వెంట వచ్చిన వాళ్ళు ఊరుకుంటారా ? పొలమంతా తిని పారెయ్యరూ ? మన పసుప్పచ్చ జనం కొబ్బరి కాయల బస్తాలతో బయలుదేరింది. మొలపొడుగు దండలు, మంగళారతులు, రక్తతిలకాలు, సాష్టాంగ ప్రమాణాలు, పాదధూళిని కళ్ళకద్దుకోవటాలు ఈ నవీన నారాయణునికి నిత్యమూ ఎదురయ్యేవే.
అందుకే ఈ వంది మాగధ పరివారం ఒక కొత్త పద్ధతిలో ఆయన్ని పూజించి తరించింది. ఆయనకు 64 ఏళ్లట. అందుకని 64 కొబ్బరి కాయలు ఆయన పాదాల దగ్గరే పగులగొట్టి ( పాదాల మీద కాదు ) ఆ నీళ్ళతో ఆయన పాదాలు కడిగారు. ఎందుకంటే ఆయనే వారికి సర్వమట, ఒక చోట మహాత్మునిగాను, వేరొక చోట యుగపురుషునిగాను మరో చోట కవిచక్రవర్తిగాను ఇంకో చోట నిజం నవాబుగాను ఆయన దర్శనమిస్తాడట.
విభూతి పట్టీలు పెట్టుకొంటే విష్ణుమూర్తివనుకొన్నాను. ఆంజనేయుడివటోయ్, వెంకటేశ్వర్లూ ? అని ఈ అవతారాల మూర్తిని చూసి సామాన్య జనం కన్ ఫ్యూజ్ అవుతున్నారు.
విశేషమేమిటంటే ఇంతమంది మైనపు ముక్కుల వాళ్ళు, వీపుతోముడుగాళ్ళు వ్యక్తి పూజమాటున శక్తిపూజ చేసేవాళ్ళు. 1983 కు ముందు ఆ స్వామి చుట్టూలేరు. వాళ్ళు కొట్టే ఊదరకు స్వామి వారు బెలూన్ లా ఉబ్బిపోతున్నారు. ఇంకా ఇంకా ఊదేయ్యమంటున్నారు. ఊదేకొద్దీ ఉబ్బి తబ్బిబ్బయిపోతున్నారు. కాలం కలసిరాకపోతే మారేమన్నా అవుద్ది స్వామీ అని ఎవరన్నా చెప్పినా వినే స్థితిలో లేరు ! ఏం చేస్తాం, తెలుగుదేశం ఖర్మ !
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి