దేశ సంపదను కొల్లగొట్టడమే దేశభక్తి?
గీటురాయి 16-9-1988
సమ్మె ఘొరావు దొమ్మి – బస్సుల దహనం లాఠీ
శాంతి సహనం సమధర్మంపై – విరిగెను
గూండా లాఠీ
అధికారంకై పెనుగులాటలో అన్నాదమ్ముల
పోటీ
హెచ్చేను హింసా ద్వేషం ఏమౌతుందీ దేశం ?
అని ఓ పెద్దమనిషి చెప్పినట్లుగానే
జరుగుతున్నది. ధర్నాలు, సత్యాగ్రహాలు, నిరాహారదీక్షలు, ఊరేగింపులు, ఉద్యమాలు మంచి ఊపు మీద సాగిపోతున్నాయి. ఏడుస్తున్నా వెందుకురా అంటే
ఒకనాడు నా మొహం నవ్వి చచ్చిందా అన్నడట. ఈ దేశంలో అలజడి, ఆందోళన లేని రోజంటూ లేదేమో ! సరే ఈ ఆందోళనలు జరుపుతున్న వారి తీరు ఎలా ఉందంటే పెరటికి పొయ్యిన వాడిని తన్నలేక దేనినో తన్నినట్లుగా ఉంది. మొహం బాగా
లేదని అద్దం పగులగొట్టినట్లుగా గూడా ఉంది.
ఏ ఉద్యమం లేవదీసినా అది శాంతియుతంగా సాగిపోతే ఎవరికైనా అభ్యంతరం ఉండదు. కానీ ప్రతివాడూ తన ప్రతాపాన్ని ఆర్టీసీ బస్సుల మీద చూపిస్తుంటే ఇక ఏం చెయ్యాలి ? ఒక ప్రక్క నక్సలైట్లు ఆర్టీసీ
బస్సుల్ని తగల బెడుతున్నారని గగ్గోలు
చెందే సత్యాగ్రహులే తమ వంతు వచ్చే సరికి వాటి గాలులు తియ్యటం, అద్దాలు పగులగొట్టడం, రాళ్ళు రువ్వటం వాటిని తగుల బెట్టటం లాంటి చేష్టాలకు తలపడుతున్నారు. ఇక వాళ్లకూ
వీళ్ళకూ తేడా ఏమిటి ?
ఎద్దు
చేను మేసిపోయిందని గాడిద చెవులు కోసినట్లుగా ఉంది ఈ ఉద్యమాల
వ్యవహారమంతా. సమ్మెలు చేసేవాళ్ళు ప్రభుత్వాధినేతల్ని పట్టుకొని మీకు సిగ్గులేదా, శరం లేదా,
చీమూ నెత్తురు, మానాభిమానాలు లేవా ? మా కోర్కెలు తీర్చే మనసు లేదా ? అని వాళ్ళను మొహాన పట్టుకొని అడగవచ్చు. అలా అడిగే అవకాశం
దొరక్కపోతే నాయకుల ఇళ్లముందలో కార్యాలయాల ముందలో గుడారాలు వేసికొని రిలే నిరాహార దీక్షలు చేస్తూ సత్యాగ్రహాన్ని ప్రకటించవచ్చు.
పది మంది పత్రికా విలేఖరుల్ని పిలిపించి
వారి ముందు గూడా తమ ఆవేశాన్ని వెళ్లగక్కి తమ డిమాండ్లకు బహుళ ప్రచారం గావించుకోవచ్చు. కానీ నోరు వాయిలేని మూగజీవాల వంటి బస్సుల్ని తగలబెట్టటం ఎంత పాపమో, ఎంత నీచ కార్యమో ఆలోచించుకోవాలి. దేశ సంపదను నాశనం చేస్తే అది ఎవరికి నష్టం ? దేశ భక్తులెవరూ దేశసంపదను నాశనం చెయ్యరని
తెలుసుకోవాలి.
పనీ లేదు పాటా లేదు పదండ్రా ప్రదర్శనలన్నా చేద్దామని ప్రతిపక్షాల వాళ్ళు బయలుదేరుతుంటారు (రాష్ట్రంలో కేంద్రంలో గూడా). పనిలేని మంగలి పిల్లి
తల గొరిగినట్లుగా, పని పాతరబెట్టి గంప జాతరకు పోయినట్లుగా
కొన్ని ఉద్యమాలు ఉన్నాయి. కేవలం తమ
ఉనికిని తెలియజేసుకోవటానికి,
మేమింకా బ్రతికే ఉన్నామని చాటుకోవటానికి ఏదో ఒక నెపంతో చౌకబారు ఉద్యమాలు
ఊరేగింపులు చేసి చీటికీ మాటికీ ప్రజా జీవితానికి “ఇబ్బందులు”
కలిగించేవారూ ఉన్నారు.
ఇక ప్రభుత్వం నడిపే నాయకులు వీరికి
తోడుబోయిన వారే గదా ? బావా
మరుదుల సరసం లాగా, కట్నం కాడ పేచీ పడిన వియ్యంకుళ్ళలాగా ప్రభుత్వము ప్రతిపక్షాలు ప్రజల ముందు ప్రదర్శన లిస్తుంటాయి. సవాళ్ళు విసురుకుంటాయి. ఈ కసుర్లు బుసుర్లతోటి కాలక్షేపం బాగానే జరుగుతుంది కానీ ఫలితం శూన్యమే. దేశ పరిస్థితి మాత్రం ఈకలు తీసిన కోడిలాగా తయారౌతుంది.
జిల్లాల వాళ్ళు హైదరాబాదుకు, రాష్ట్రాల వాళ్ళు ఢిల్లీకి పోయి
ప్రదర్శన లిచ్చే పరిస్థితి రాకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుతాలు ఇక మీదటైనా జాగ్రత్త పడితే బాగుంటుంది.
కేవలం అధికారం కోసం పెనుగులాడటం మాని ప్రజోపయోగ కార్యక్రమాలు
కొనసాగించటం అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ తమ ధ్యేయంగా పెట్టుకోవాలి. వాటి కోసం పార్టీ తరఫున నిధులు కేటాయించాలి. పోస్టర్లకు
ప్రదర్శనలకు పెట్టే ఖర్చు ఇటు మళ్ళించితే
చాలు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి