ఇది అప్రాచ్యుల స్వర్గం
గీటురాయి 21-10-1988
“నిలువవే వాలు కనుల దానా
వయారి హంస నడక దానా
నువ్వు కులుకుతు గలగల
నడుస్తు
ఉంటే నిలువదె నా మనసూ
ఓ లలనా ఓ మగువా అది నీకే తెలుసు”
అంటూ అబ్బాయిలు ప్రేమ గీతాలు పాడుతూ వెంటపడుతుంటే, పరవశించి
పొర ‘పాటు’ పడుతున్న పడతులు ఆత్మహత్యలకు పూనుకుంటున్న
సినీ తారామాణుల్ని చూచి బుద్ధి
తెచ్చుకోవలసిన సమయం ఆసన్నమయ్యింది. శ్రీప్రియ, రాధిక, జయలక్షి ఇలా ఎందరో ప్రేమ వ్యవహారాలలో మోసపోయి, పెళ్లి
కావడమే గగనమై ప్రాణాలకు తెచ్చుకోవడం గమనించాలి.
పెళ్లికాకముందే ప్రేమ, పిచ్చి అంటూ బరితెగించిన బాలలు తరువాత విపత్కర
పరిస్థితులనుఎదుర్కొంటున్నారు. పాశ్చ్యాత్య
దేశాలలో పదవ తరగతి లోపు విద్యార్ధినులకు (మైనారిటీ
కూడా తీరని బాలికలకు) గర్భస్రావాలు చేయిస్తున్న
అనేక సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమ వివాహాలను ప్రోత్సహించటమే నాగరికతా లక్షణంగా
భావిస్తున్న నవీన సమాజం వివాహాత్పూర్వ
మోహాలు ఎంతటి అసహ్యకరమయిన పరిణామాలకు దారితీస్తున్నాయో కొంచెం ఆలోచించాలి.
ప్రేమ
గుడ్డిది అంటారు. నిజమే అది జరుగబోయే కాలాన్ని చూడలేదు.
రాబోయే పరిణామాలను ఊహించలేదు. అయితే అది ఎవరి ప్రేమ
? కేవలం బుద్ధి ఙ్ఞానం లేని గాలి మనుషులదే. సరైన మనిషి ప్రేమ ఎలా
ఉంటుంది ? నీతి నియమాలకు కట్టుబడి, ముందు చూపు కలిగిందై ఉంటుంది. గుడ్డి
ఎద్దు చేలో బడినట్లుగా ఉండదు. పెళ్లి పెటాకులు, మొగుడూ మొద్దూ ఏమీ వద్దు అనుకునే రకాలకు హద్దూ పద్దూ ఏదీలేదు. కాపురం, సంతానం సంసారం, శ్రీవారు లాంటి చక్కని పద్ధతుల్ని
కోరుకునే ఆడవారు అదను వచ్చే వరకు నిగ్రహంతో ఉండటం ఎంతో మంచిది. ఈ సూక్తులు
ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకు కూడా వర్తిస్తాయి. అయితే ఆడవాళ్ళకే ఎక్కువగా ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే, కార్య ఫలితాన్ని ప్రతి ఫలించేది. పాప భారాన్ని మోసి దానికి
రూపునిచ్చేది ఆడదే. మగ వాడు దుర్మార్గుడయితే దులుపుకొని పోగలడు.
స్త్రీ సహించక తప్పదు. అందుకే అరటి ఆకు మీద ముల్లు పడినా, ముల్లు మీద అరటి ఆకు పడినా ఆకుకే
ప్రమాదం అని పెద్దలు భావగర్భితంగా స్త్రీకి సుద్దులు నేర్పారు.
“ప్రేమంటే
తెలుసుకోండిరా, ప్రేమించి సుఖపడండిరా” అంటూ పిల్లల్ని
ప్రేమ కలాపాలకు పురికొల్పుతున్న పాశ్చాత్య పెద్దలు (అప్రాచ్యులు)
ఇప్పుడిప్పుడే తమ జనాభాకు జరిగిన నష్టం
గమనిస్తున్నారు. 50 శాతం పెళ్ళిళ్ళు కేవలం
ఏడాది తిరక్క ముందే పెటాకులౌతున్నాయి. పెళ్ళీ
పెటాకులు రెండూ లేకుండానే పుట్టిన లక్షలాది పిల్లలు అనాధాశ్రమాలలో ఉంటున్నారు. ఇలాంటి పనుల్ని అప్రాచ్యం అన్న మన
ప్రాచ్య దేశంలో గాంధర్వ వివాహాలు, సద్యో గర్భదానాల గాధలు మన యువతకు
నేటికీ మార్గదర్శకంగా, పూజనీయంగా నిలచి ఉండి పెడదారులు
పట్టిస్తున్నాయి. ఆనాడు రంభ ఊర్వశుల రాగతాళాలు,
మేనక తిలోత్తమల మేనిచందాలు మునుల్ని సైతం
మైమరపింపజేస్తే, ఈనాడు సినీతారల తళుకు బెళుకులు, వెండి తెరమీది నగిషీలు మన జనాన్ని
మరులు కొల్పుతున్నాయి.
దేనికో పెత్తనమిస్తే గోదావరంతా తేలికాడిందట. సినిమా అనేది అద్భుతాలతో కూడిన ఓ రంగుల ప్రపంచాన్ని జనం కళ్ళ
ముందు ఉంచుతున్నది. మరులుకొల్పుతూ
మాయజేస్తూ మనుషుల్ని మోహాంధకారంలోకి నెట్టివేస్తున్నది. మత్తుమందులు సేవించిన వాడు
మరో లోకంలో విహరించినట్లుగా, పెద్ద మనుషులు సైతం ప్రేక్షకులై
అడ్డమయిన సినిమాలు చూడ్డానికి
సిద్దపడి వస్తున్నారు. గోధుమలు వేస్తే బాదములు పండనట్లుగానే, అశ్లీల, అసభ్య, సంస్కారరహిత, స్వేచ్ఛావాద, స్త్రీ అంగాంగ దోపిడీ
విధానాలే ధ్యేయాలుగా పెట్టుకొని డబ్బు చేసికుంటున్న సినిమాలవల్ల యువతీ యువతులు పెడదారి పట్టి పాడయిపోతున్నారు.మనిషి
జీవితంలోని ప్రతి అడుగునూ నియంత్రిస్తూ ఉండే నైతిక శాసనాలను ద్వేషించి దూషించే ఈ స్వేచ్ఛా
సమాజవాదులు, సినీ మాయాజీవులు, కామతప్తులు, అంద చందాల బహిరంగ ప్రదర్శకులు, ఆత్మహత్యలకు
పాల్పడే నిస్తేజులు ఇప్పటికయినా నైతిక నియమావళిని ఏర్పరచుకోవాలి.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి