27, మార్చి 2013, బుధవారం

సారె జహాఁసె అచ్చా హిందూ సితా హమారాఁ!



సారె జహాఁసె అచ్చా హిందూ సితా హమారాఁ!
గీటురాయి 3-12-1993

       బాబ్రీ మసీదు నేలమట్టం తరువాత దేశంలో హిందూ ముస్లింల మధ్యగల సామరస్య వాతావరణానికి తీవ్ర విఘాతం కలిగింది. ముస్లింలు మనుషులు కారా ? వారికి ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలు ఉండవా ? ఎందుకు సోదర భావంతో మెలగుతున్న వారిని విడగొట్టడం ? దేశానికి హిందువులు అజంతా, ఎల్లోరాలనిస్తే, ముస్లింలు తాజ్ మహల్, కుతుబ్ మీనార్ లను ఇచ్చారు. హిందువులు కె.ఎల్. సైగల్, మన్నాడే లాంటి అద్భుత గాయకులనిస్తే, ముస్లింలు రఫీ, నౌషాద్ లనిచ్చారు. హిందువులు లతామంగేష్కర్ నిస్తే, ముస్లింలు నూర్జహాన్ నిచ్చారు. ఒకరు గవాస్కర్ నిస్తే మరొకరు అజహరుద్దీన్ నిచ్చారు. ఇలా ఏ రంగంలో చూసుకున్నా ముస్లింల ప్రతిభ కనబడుతుంది. వారిపై కక్ష గట్టడం భావ్యమా ? అని మాజీ ప్రధాని శ్రీ వి.పి.సింగ్ ఆవేశంగా ప్రశ్నించినట్లు వార్త (ఈనాడు 9-11-1993). మానవ హక్కుల విషయంలో దుష్కీర్తిని మూటగట్టుకున్న సిద్ధార్ధ శంకరే ను అమెరికాలో మన రాయభారిగా నియమించి పీ.వి. పప్పులో కాలేశారు.  తత్ఫలితాలను దేశం ఇప్పుడు అనుభవిస్తున్నది... అయనకు ముందు అమెరికాలో మన రాయభారిగా పనిచేసిన ఆబిద్ హుస్సేన్ వాషింగ్టన్ ప్రముఖ వర్గాల్లో తలలో నాలుకగా మెలగి భారత ప్రతిష్టను ఇనుమడింపజేశారు. ఆయన పదవీ విరమణ చేసినప్పుడు వాషింగ్టన్ చెమ్మగిల్లిన గుండెతో వీడ్కోలు చెప్పింది. ఆబిద్ హుస్సేన్ పదవీ కాలాన్ని భారత ప్రభుత్వం పొడిగించనందుకు వాషింగ్టన్ లోని అడ్మినిస్ట్రేషన్ అధికారులు, అమెరికా ప్రతినిధుల సభలోని నాయకులు, సెనెటర్లు, ప్రముఖ విద్యావేత్తలూ ఎంతగానో నొచ్చుకొని తప్పుపట్టారు. అత్యంత క్లిష్ట సమయంలో ఆబిద్ హుస్సేన్ అనన్య అసాధారణ దౌత్యవేత్తగా గుర్తింపు పొందారు. భారత్ – అమెరికాల మధ్య అవగాహన వారధిని పటిష్టం చేయడంలో తనదైన శైలిలో పాటుపడిన ఆబిద్ హుస్సేన్ పదవీ కాలాన్ని పొడిగించక పోవటం పీ.వి. సర్కారు అవివేకం అవి ఈనాడు పత్రికా సంపాదకీయం వెలువరించింది ( ' స్పూర్తిరహిత దౌత్యనీతి ' ఈనాడు 4-11-1993).

       ఎవరు ఎన్ని విధాలుగా చెబుతున్నప్పటికీ మత సామరస్యం అనేది నాయకుల ప్రసంగాలలోను, కవుల కల్పనల్లోను కనిపిస్తున్నదే గాని, వర్తమాన సమాజంలో కలికానిక్కూడా కానరావడం లేదు. సామరస్య సాధనకోసం త్యాగధనులు కొందరు శ్రమించి బలై పోతున్నారు. మరోవైపు మతపిచ్చి పట్టిన నరరూప రాక్షసుల హింసాబోధనలకు ప్రేరితులైన యువతరం భ్రష్టుపట్టిపోతున్నది.

       భారతీయ ముస్లిం సమాజం పోతే పోనీ పోరా, ఈ పాపపు జగతిన శాశ్వతమెవడురా అనే నిర్వేదంలో పడిపోయింది. ఎందుకంటే  ఇది రెక్కలు తెగిన పక్షి. అఘాయిత్యానికి గురైనా నోరు విప్పలేని, పిడికిలి బిగించలేని నిస్సహాయ జాతి. నియ్యతెంతో బర్కతంత అని సరిపెట్టుకొని సర్దుకు పోయే జాతి.

       ఇలాంటి జాతి పురుషుల్ని క్రూరమైన రౌడీలుగా, దేశద్రోహులుగా, స్మగ్లర్లుగా సినిమాల్లో చూపిస్తున్నారు. ఎందరో ముస్లిం జాతిరత్నాలు ఈ దేశ ప్రయోజనాలకు ఉపయోగపడి తమ జీవితాలను త్యాగం చేశారు. కారణం, ఇది మా దేశం అనే భావనతోనే సారే జహాసె అచ్చా, హిందూస్తాన్ హమారా అనే ఇక్బాల్ గీతం, భారతీయ ముస్లిముల మనోభిప్రాయానికి దర్పణం.
 ఉంటే హిందువులుగా ఉండండి లేదా పాకిస్తాన్ కి వెళ్ళిపోండి అనే త్రిశూలధారులకు, మా దగ్గర మూడువేల మసీదుల జాబితా ఉంది, వాటిని మేము కూలగొట్టాలి అని చెప్పే శంకరాచార్యులకు జవాబు చెప్పే నాయకులు కావాలి. మానవత్వం మత పిచ్చిని అణచాలి. సామరస్యం వెల్లివిరియాలి అంటే దేశం కోసం పోటీపడి సేవలందించిన  ముస్లిములను సమాదరించాలి. వారి భాషా సంస్కృతులను గౌరవించి, ఆర్ధిక ఉద్యోగ అవకాశాలను కల్పించాలి. లేకపోతే మా యవ్వనమెల్ల కొల్లగొని ఆపై చీపురుతోడ చిమ్మి మమ్మావల పారబోతురు గదా మీకు నీతి యున్నదా అని పాలకులను నిగ్గదీసే రోజు వస్తుంది.



      
      
      

2 కామెంట్‌లు: