27, మార్చి 2013, బుధవారం

జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి !



 జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి !
గీటురాయి 24-6-1994

              పొందూర నొక్క విప్రుని
విందుకు రాబిలిచి నీకు వేడుక తోడన్
ఇందెందు ఇష్టమన ప
ప్పందే నాకిష్టమనుచు బాపడు పలికెన్

అని నానుడి. పైగా ఈ పప్పుతో పాటు నెయ్యి కూడా (జంతువు నుండి తీసింది) వెయ్య మంటాడు.

ఒక్క వానిని బలిపించు బర్రె పెరుగు బ్రాహ్మణుల కిష్టమైనది.  బర్రె పెరుగు పరగ నీలాద్రి హరిప్రీతి బర్రె పెరుగు పరమ సౌఖ్యంబునిచ్చునే బర్రె పెరుగు అది మరో సోలెడు పోస్తే త్రాగుతాను అంటాడు. ముందు ఆకు వేయించుకుంటే, తరువాత ఎప్పుడైనా తినొచ్చు అంటాడు. ఈ తిండి గురించిన యావ జనానికి రకరకాలుగా ఉంటుంది. మునిగింది ముర్దారు, తేలింది హలాలు అన్నట్లుగా ఏది తినవచ్చో  ఏది తినగూడదో ఆయా జనం ఆయా రకాలుగా నిర్ణయించుకున్నారు. మూతి పెట్టిన వాడు మేత కూడా పెట్టాడు. అయితే మేయబోయి మెడకు తగిలించుకున్నట్లుగా, మూతికి చిక్కం కట్టుకున్నట్లుగా కొంత మంది అతిగా ప్రవర్తించారు.  ముత్తెమంటి ముతరాచ కులం చేపలు తిని చెడి పోయిందని బాధపడుతున్నారు.

ఇటీవల ఢిల్లీ గద్దెనెక్కిన బిజెపి ప్రభుత్వం మాంసం దుకాణాలు మూయించింది. పశువధ శాలల్ని మూయించింది. లక్షలాది కష్టజీవులకు మాంసం దొరకలేదు. వేలాది మాంసం వ్యాపారులకు జీవనోపాధి పోయింది. దొంగచాటుగా జీవాలను కోసి, అధికారులకు లంచాలిచ్చి మాంసం  అమ్ముకుంటున్నారు. జీవకారుణ్యం, గోసేవ పేరుతో మేనకా గాంధీ మొదలు పీలా పీచు నాయకుల వరకు గోవధ నిషేదానికి వత్తాసు పలుకుతున్నారు. ఈ మధ్య హైదరాబాద్ లోని అల్-కబీర్ ను మూయిస్తానని అరుస్తున్నారు. దాని యజమాని ఒక మార్వాడి. కోట్లాది రూపాయల విదేశీ మారక ద్రవ్యం సంపాదిస్తానంటున్నాడు. విదేశాలకు ఎగుమతి చేసి లాభార్జన చెయ్యాలనుకునే మార్వాడీ గారి అల్ కబీర్ ను మూయిస్తే ముంచుకొచ్చే ప్రమాదం ఏమీ లేదు గానీ, మాంసం లేనిదే ముద్ద దిగని బడుగు జీవులు ఎంతో మంది ఈ దేశంలో ఉన్నారు. వారి నోటి కాడ మాంసం తీయటం మహాపాపం. మాంసం తినని వాడిని ఎవరూ బలవంతం చెయ్యటంలేదు. తినే వాడిని మానుకొమ్మని చెప్పటం, కేవలం పప్పు తిని బతకమనడం అన్యాయం. పులి గడ్డితింటుందా ? సఫారీ పార్కుల పేరుతో వాటికి వేలాది ఎకరాలు కేటాయించి మాంసం వేసి మరీ పెంచుతున్నామే. మేనకాగాంధీకి పులులకు గడ్డి తినిపించే ఏర్పాట్లు చేయాలనిపించలేదా ? పూర్తి శాఖాహార పర్యావరణాన్ని ఏర్పాటు చేయాలనిపించలేదా?

చిన్నప్పటినుంచీ చింతకాయలు అమ్మిన దానికి సిరి మానం వస్తే ఆ వంకర టింకరని ఏం కాయలు అందట. శ్రోణే మేక ఉదకం గామవాజతి మాంసమేకః  అంటూ అవు మాంసాన్ని లొట్టలు వేసుకుని తిన్న వేదజాతి సంస్కృతిని విస్మరించి ఈనాడు ముస్లిములు మాత్రమే గోమాంసం తినే అనాగరికులంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. మంచి సంతానాన్ని కనాలంటే ఆవు మాంసం తినాలని బృహదారణ్యకం బోధించింది. ప్రాచీన ఆర్యులు మాంసం చాలా ఆపేక్షగా తినేవారని మల్లాది సూర్యనారాయణ శాస్త్రులు వారు రాశారు. అగస్త్యుడి తిండి అందరికీ తెలుసు. ఈ విషయాలన్నీ మరిచి పోయి మాంస నిషేదానికి ముందు కాళ్ళ మీద లేవటం, పేద శ్రమ జీవుల నోరు కొట్టడం మంచిది కాదు. పర్యావరణ రక్షణ, జీవ కారుణ్యం అనేవి బాగా డబ్బున్న వాళ్ళు ఫ్యాషన్ గా చేసే శాడిస్టు పనులు. కుక్కల మీద ఉన్న ప్రేమ వారికి పేద వారి మీద ఉండదు. కానొచ్చే కొండల్ని గట్టెక్కి చూడనక్కరలేదు. మాంసం తినకుండా మనిషిని ఆపటం ఎవరివల్లా కాదు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి