27, మార్చి 2013, బుధవారం

జ్ఞాన భాండాగారాలు గ్రంథాలయాలు



జ్ఞాన భాండాగారాలు గ్రంథాలయాలు
గీటురాయి 16-4-1993

1919 లో ఆంద్రులు స్థాపించిన అఖిల భారత గ్రంధాలయ సంఘం తొలి మహాసభ జరిగిన నవంబర్ 14 వ తేదీన జాతీయ గ్రంథాలయ దినం గా గుర్తించి వారోత్సవాలు జరుపుతున్నారు. దాని కేంద్ర స్థానం విజయవాడ. స్థాపకుడు అయ్యంకి. ప్రస్తుతం రాష్ట్రంలో 4100 గ్రంథాలయాలున్నాయి. ఎయిడెడ్ గ్రంథాలయాలు 2320 ఉన్నాయి. ఇవి 1960 ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయ చట్టం కింద పనిచేస్తున్నాయి. స్థానిక సంస్థల నుంచి ఆస్తి పన్ను, ఇంటిపన్నుపై రూపాయికి ఎనిమిది పైసలు వంతున వచ్చే గ్రంథాలయ సెస్సు వీటికి ఆదాయం. సిబ్బంది జీతాలు మాత్రం ప్రభుత్వం చెల్లిస్తుంది.

     గ్రంథాలయ సేవలు

ఆంధ్ర పత్రిక, ఆంధ్ర గ్రంథాలయ ట్రస్టు వల్లూరి సూర్యనారాయణ ట్రస్ట్, సరస్వతీ సామ్రాజ్యమ్ రాజారామమోనరాయ్ లైబ్రరి ఫౌండేషన్ పౌర గ్రంథాలయాలకు ఎంతగానో సేవచేశాయి. గ్రంథాలయ శాస్త్రం మీ డాక్టర్ వెలగా వెంకటప్పయ్యగారు 60 పుస్తకాలు రాశారు. గ్రంథాలయ సేవలో విశిష్ట సేవ చేసిన వారికి గ్రంథాలయ పితామహ అయ్యంకి వెంకటరమణయ్య గారి పేరుతో 1979 నుంచీ అవార్డు ఇస్తున్నారు.

జరగవలసిన పనులు
1.        1978 పౌర గ్రంథాలయ శాఖ రూపొందించిన మాస్టర్ ప్లాన్
2.     1976 గోపాలరావు ఎగ్బోటే సంఘం సిఫారసులు
3.     1978 వావిలాల గోపాలకృష్ణయ్య సంఘం సిఫారసులు

1981 లో స్థాపించిన స్టేట్ సెంట్రల్ లైబ్రరీ రాష్ట్రంలో కెల్లా పెద్ద లైబ్రరీ. దీనిలో 3 ½ లక్షలు పుస్తకాలున్నాయి. ఇది రోజుకు 16 గంటలు పనిచేస్తుంది. శాఖా గ్రంథాలయాలు రోజుకు 6 గంటలు గ్రామీణ గ్రంథాలయాలు రోజుకు  3 గంటలు పనిచేస్తాయి. ఈ సమయాన్ని పెంచాల్సి ఉంది. అలాగే కాల్పనిక సాహిత్యం కంటే పాఠ్యపుస్తకాలను లైబ్రరీల్లో ఎక్కువగా ఉంచాలి.

మొట్టమొదటి సంచార గ్రంథాలయం 1956 లో ఏలురులో ప్రారంభించారు. ఇక మన రాష్ట్రంలో మొట్టమొదటి గ్రంథాలయం 1839 లో బ్రిటీష్ జడ్జి థామస్ చేత రాజమండ్రిలో స్థాపించబడింది. 1886లో విశాఖపట్టణంలోని ఉపాధ్యాయుడు శ్రీ మంతిన ఆదినారాయణరావుసరస్వతీ గ్రంథాలయం స్థాపించాడు. దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారు తమ ఆంధ్ర గ్రంథమాల ఆంధ్రపత్రిక, భారతి లను గ్రంథాలయాలకు ఉచితంగా సరఫరా చేయటమే గాక తెలుగు సాహిత్య సమిష్టి ఆరంభం నుండి 1927 వరకు వెలువడిన తెలుగు లఖితప్రతులు, పుస్తకాల ఆంధ్ర వాజ్మయ సూచిక ను ప్రచురించారు.

కవిశేఖర శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులుగారు అధ్యక్షతన 1914 ఏప్రిల్ 10 వ తేదీన ఆంధ్ర దేశ గ్రంధ బాంఢాగారుల సమావేశం బెజవాడలో జరిగింది. తన ఉపన్యాసం చివర్లో ఆయన ఇలా అన్నారు :

గాలి అందరికీ ఎలా స్వాధీనం కావాలి
జ్ఞానం కూడా అలాగే స్వాధీనం కావాలి
నీరు అందరికీ ఎలా సేవ్యమై ఉందో
జ్ఞానం కూడా అలాగే సేవ్యంగా ఉండాలి
సూర్య చంద్ర మండలాల తేజస్సు అందరికీ
ఎలా సౌఖ్యప్రదంగా ఉందో
జ్ఞానం కూడా అలా సౌఖ్యప్రదంగా ఉండాలి

ఈ ఆదర్శం తోటే జాతి, కుల, మత వర్గ వివక్షత లేకుండా సమాజంలోని అన్ని వర్గాల వారికి సమానస్థాయిలో గ్రంథాలయాలు మౌనంగా సేవ చేస్తున్నాయి. వాటి సేవకు మనమంతా కృతజ్ఞులం. వాటిని మరింత అభివృద్ధి చేసుకోవలసిన అవసరం మనపై ఉంది. మత పిచ్చితో గుళ్ళూ గోపురాలకోసం కొట్టుకు చావడం మాని, గ్రంథాలయాలు నిర్మించుకోవలసిందిగా ప్రజలకు నా విజ్ఞప్తి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి