క్రియా శూన్యమయిన కవిత్వంతో ఒరిగేదేమిటి కవిపుంగవా ?
గీటురాయి 6-2-1987
కవిత్వం కంతిరిదని చెప్పినందుకు కొందరు కవులు నా పైన విరుచుకుపడ్డారు. “ అలనాడు బాలకృష్ణుడు పద్నాల్గు భువన భాండాలను తన అంగిట్లో చూపించినట్లు, సప్త మహా సముద్రాలను ఒక్క నీటి బొట్టులాగా చూపించేదేగదా కవిత్వం ! “ కట్టె, కొట్టె, తెచ్చె” అని రామాయణాన్ని ఒక్క ముక్కలో ఎంత చక్కగా కవించారో నీకు తెలియదా ?
1. ఎండిన లోకాన్ని పచ్చబరిచేది
2. హృదయాలను రంజింపజేసేది
3. మనిషిలో సృజనాత్మక శక్తిని పురికొల్పేది
4. వహ్వాయని తలలూయించేది కవిత్వమే గదా!” అని వారు నామీద ఎదురు ప్రశ్నలు వేశారు. సరే ఇవి ఈ మాత్రం నిజమో అని ఆలోచించాను.
“హంసవింశతి” అనే అపూర్వ గ్రంధంలో కంసాలివాని కుంపటి (కమతము) మీద కవిత్వం ఇలా ఉంది : -
చ || కమతము కట్లే సంచి యొరగల్లును
గత్తెర సుత్తె చీర్ణముల్ ధమనియు
శ్రావణంబు మొలత్రాసును బట్టెడ
నీరు కారు సానము పటుకారు
మూస బలునాణె పరీక్షలో
మచ్చులాదిగా నమరగ
భద్రకారక సమాహ్వయు డొక్కరుడుండు నప్పురిన్
“ ఆ పట్టణంలో ఒక కంసాలి ఉన్నాడు “ అనే మాట చెబితే సామాన్య జనానికి అర్ధం కాదు అనుకొని కవి కుంపటి చుట్టూ ఉండే పరికరాలన్నిటిని పేరు పేరు వరసన వర్ణించి అవన్నీ అమరిన, వాటి చేత ఆవరించబడిన అగసాలి ఆ పురంలో ఉన్నాడు అని సెలవిచ్చాడు. మధ్యలో ఎక్కడా కామా కూడా లేనందువల్ల ఈ పద్యం చదివే వ్యక్తి మధ్యలో ఎక్కడా గాలి పీల్చకూడదు. గుక్క తిరక్క చచ్చినా కవి నొచ్చుకోడు. విస్తారమైన సముద్రంలాంటి విషయాన్ని ‘క్లుప్తంగా’ వివరించిన విధానం ఎంత వివరంగా ఉందో చూశారుగా ! మరి ఇదే “ కవిత్వం “ అంటే.
“పంచతంత్రం“ లో “కాశీమహిమయు మీచే వాసిగవిని సంశయముల బాసితిమిక నీ దాసులము “ అని కొందరు కవికి దాసులై పోతారు. కాశీ చూడకుండానే కవి చెప్పిన కాశీ కవిత్వం విని దిమ్మెర పోయారు. ఎండిన ఎడారిని సైతం సస్యశ్యామలం, సుజలాం, సఫలాం అని కవి వ్రాయగలడు. “ సస్యశ్యామలదేశం, అయినా నిత్యం క్షామం “ అనే కవిని చూస్తే పైకవి పళ్లుకొరుకుతాడు. ఆకలిచావులు అంటే కాదు, దిక్కులేని (అనాధ) చావులు అంటంలేదా ఈ నాయకులు ? వీళ్ళు కూడా కవులే !
“రవి గాంచనిచోటును కవి గాంచును “ అన్నారు. సూర్యుడికి కానరాని సంగతులు కవికి కన్పిస్తాయట. “ వసుచరిత్రం” లో కవికి ఎలాంటి సంగతి కానొచ్చిందో చూడండి : -
“ అభినవాలోక మోత్కంఠ
నధిపుడరనలరుబోడి సమగ్ర
లజ్జానుభావభావయై తెరమాటున
బగటు చూప చూపరకు దోచే
పరిణయ స్పూర్తియపుడు “
కేవలం తెరచాటున ఉన్న అలరుబోడి సంగతేకాదు ఆమె తలలో ఉన్న తలపులు సైతం కవిగారు కనుక్కొన్నారు. ఈ పని మరి రవిగారు చేయలేరుగదా ! ఇలాంటి పద్యంతో సూర్యుడు మన హృదయాలను చూరగొనలేడుగదా ?
ఇక మనిషిలో సృజనాత్మకశక్తి (అంటే కట్టుకథలు కల్పించే విజ్ఞానం)
పురికొల్పేది కవిత్వం. “ పాదలేపనం “ పూసుకొని ప్రవరాఖ్యుడు వరూధిని దగ్గరకు (హిమాలయాలకు) ఎగిరిపోకముందు ఆ పసరు ప్రభావాన్ని గురించి ప్రత్యేకమైన లెక్చరిచ్చిన సాధువుంగవుడి సృజనాత్మ శక్తికి మనం జోహార్లు అర్పించాల్సిందే !
తరువాత వహ్వా అని తలలూయించటం కవిత్వం యొక్క ప్రత్యేక కళ. “ఇలదేవీయం” అనే గ్రంధరాజాన్ని రచించిన కవి జనాన్ని ఎలా తలలూయించాడో చూసి మీరు కూడా తలలూపండి : -
“ఇంతీ, పూబోణుల మేల్బంతీ,
చేమంతి విరి రువారపు బంతీ,
కంతుని పట్టపు దంతీ”
ఇంతీ, మంతీ, బంతీ , దంతీ అనే మాటల్ని గంతులేయించటం ద్వారా వినేవాళ్ళలో ఒకలాంటి పూనకం వస్తుంది. ముఖ్యంగా భజనల్లో భక్త బృందాలు బొమ్మలాటల వాళ్ళు ఇలాంటి కవిత్వాన్నే ఎరికోరుకుంటారు. మధ్యలో మాటలు మరచిపోయినా చివరికి “బంతీ” అంటే చాలు. ఆ బంతి మొత్తం కలిసివస్తుంది.
ఇంతకీ నేను చెప్పదలుచుకొన్న దేమిటంటే పచ్చి అవకాశవాదంతో గోరంతను కొండంత చేయకుండా ఉన్నదున్నట్లు కవిత్వం చేయటం మంచిదే. కేవలం ఉపయోగంలేని కవిత్వంతో కాగితాలను నింపి, దేశంలో కాగితం కొరతకు కారణం కావొద్దని కవులకు మనవిచేస్తున్నాను.
కవిపుంగవులకు మరో వినతి కూడా చేయడం భావ్యమని భావిస్తున్నాను. అదేమంటే, వారు చెప్పే విషయాలను కొంతయినా ఆచరించాలి. కనీసం తాము చెప్పే మాటలపై నిలకడ కలిగి ఉండాలి. అలాకాకుండా కేవలం ఊహాలోకాల్లో విహరించి తమ కవిత్వంపై గురి కలవారిని భ్రష్టుపట్టించి పాపం కట్టుకోరాదు. ఈ సందర్భంగా దివ్యఖురాన్ కవులను గురించి ప్రస్తావిస్తూ చెప్పిన సత్యం గమనార్హం.
“మతి భ్రమించిన వారూ,దారితప్పిన వారే కవుల వెనుక నడుస్తారు. వారు దారీ తెన్నూ లేకుండా ఊహా లోకంలో విహరిస్తూ ,తాము చేయని వాటి గురించి క్రియాశూన్యమయిన మాటలు పలుకుతుండటాన్ని మీరు చూడటం లేదా ? అయితే విశ్వసించి సత్కార్యాలు చేసే మంచికవులు మాత్రం దైవాన్ని అత్యధికంగా స్మరిస్తారు". (దివ్య ఖుర్ ఆన్ . 26.224-227)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి