నిలపరా నీ పార్టీ నిండు గౌరవము
గీటురాయి 25-12-1987
“ పరువు పాడై జనుల పౌరుషమణగారు
కులము గోదావరి కూల జరుగు
మహిమ మర్యాదలు మంటిలో గలియును
చదువు సంధ్యలు చట్టువారు
ప్రజ్ఞలు బుద్ధులు పరలోక మేగును
గొప్పలు కీర్తులు తుప్పలెక్కు
ధర్మ మార్గము నీతి నిర్మూలమై యుండు
సకల ప్రతిష్టలు సన్నగిల్లు
వంశమందున నొక పాపవర్తనుండు
బుట్టుటను జేసి బుధులకీ భూమియందు “
అంటూ ప్రదేశ్ కాంగ్రెస్ సంయుక్త కార్యదర్శి శ్రీ హనుమంతరావు తెగ మదనపడిపోతున్నారు. హనుమయ్యా అసలు సంగతి ఎంటయ్యా అని నిలదీసి అడిగితే పాపం, దాచుకోకుండా పత్రికల వాళ్ళకు చెప్పారు. తెలుగు జాతి పరువు ప్రతిష్టలు రామారావు అనే ఒక పాపవర్తనుడి వల్ల మంట కలిసిపోయాయట. ఆరుకోట్ల ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని ‘అన్న‘ అంగడి వీధిలో అమ్మివేశాడట.
ఇలాంటి ముంత దాపుడు మాటలు మాని అసలు ఏం చేశాడో విపులంగా చెప్పు అని పత్రికల వాళ్ళు పట్టి పట్టి అడిగితే, ఫాల్కీవాలాను తెచ్చి తన కేసులో వాదింపజేసుకున్నాడే ఇంతకంటే తెలుగు వాళ్ళకు పరాభవం ఏం కావాలి ? తెలుగు పత్రికా విలేకరులై యుండి ఆ మాత్రం అర్ధం చేసుకోలేరా? అని ఎదురు ప్రశ్నలు వేశాడాయన.
నిజమే, అన్న ఫాల్కీవాలాను ఎందుకు పట్టి తెచ్చాడు ? ఆంధ్రుల్లో ఆయన పాటి సమర్ధులైన న్యాయవాదులు లేరా? తెలుగు జాతి, తెలుగు తేజం అంటూ ఊగిపోయే అన్న తెలుగు న్యాయవాదులనే నియమించుకోవాలి గదా ? ఇది జాతి ద్రోహం కాదా? అంటూ హనుమంతరావు గారి అనుయాయులు కూడా ఆవేశపడ్డారు.
ముసలి ముప్పందాన కుసుమ రోగం వచ్చినట్లు, ముత్తెమంటి ముతరాచకులం చేపలు తిని చెడిపోయిందన్నట్లు, జాత్యాభిమానం, ప్రాంతీయ దురహంకారం కాంగై వాళ్ళకు ఎప్పుడు అంటుకుందా అని ప్రజలు ఆశ్చర్యపోయారు. “ నిలుపరా నీ జాతి నిండు గౌరవము” అంటూ అన్న ఆవేశపడుతూ ఉండే మాట నిజమే. అయితే అన్న నోటి నుండి అలాంటి మాటలు వెలువడిందే తడవుగా కాంగ్రెస్ వాళ్ళంతా కట్టగట్టుకొని అన్నను
“తెలుగు జాత్యహంకారి, ప్రాంతీయ దురభిమాని, వేర్పాటువాది” అని నిందించే వారు. మరి ఇవ్వాళ వాళ్ళేనా, ఆ నోళ్ళతోటేనా, “జాతి అభిమానం” అంటూ అరచి గీపెడుతున్నది?
“ముందు నేను భారతీయుడిని, ఆ తరువాతే ఆంధ్రుణ్ణి” అని అన్న అనేకసార్లు అన్నాడు. అప్పుడు ఈ జాతీయ వాదులు ఏమీ మాట్లాడలేదు. పైగా అదంతా ఒట్టి నటన పొమ్మన్నారు. కొత్త ఎద్దు పేడ ఇంటిల్లి పాదీ ఎత్తినట్లు ఏదో ఒక నెపం చూపించటం మందబలంతో ఆ నెపాన్నే గీపట్టడం కాంగ్రెస్ వాళ్ళకు ఆనవాయితీ అయిపోయింది.
మొండి గురువు బండ శిష్యుడు అన్నట్లు ఢిల్లీలోని అధిష్టాన వర్గంది ఒక దారైతే రాష్ట్రాల్లోని అనుచరగణానిది మరో దారి అవుతున్నది. కూసే అమ్మ నోరు కుట్టి పెడితే, “అయ్యాలారా ! ఏటెంకాయకు పసుపు పూయలేదు” అందట. ప్రాంతీయ దురభిమానపు కూతలను ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఎలా సమర్ధించుకుంటుందో అర్ధం గావటం లేదు. చూడగా చూడగా ఈ క్రింది పద్యం ఎంతో నిజం అనిపిస్తున్నది.
జారిణి తన వగు పనులే
వ్వారలు జూడరను బుద్ధి వర్తించునిలన్
క్షీరము దాగు బిడాలము
కోరికలో దలచునట్లు గువ్వల చెన్నా !
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి