ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా...నిలుపరా నీ’కుల’గౌరవం!
గీటురాయి 17-7-1987 మతకలహాల మారణ హోమంలో మతిలేనివాళ్ళు ఒక పక్క మాడి మసయిపోతుంటే,మరో ప్రక్క ఇది చాలదన్నట్లు కుల సంఘర్షణలు దాపురించాయి. కులానికింత అంటే తలా గోరంత అన్నట్లు ఈ కర్మ భూమిలో కుల యుద్ధాలు కొల్లలయి కనిపిస్తాయి. కిందొక బొంత, పైనొక బొంత, నాకేమీ చింత? అన్నట్లు మన దేశంలో జనం తింటానికింత దొరికితే చాలు అనుకునే రకం కాదు. ఒక ప్రక్క అంతా కర్మ, పూర్వజన్మ సుకృతం మరో ప్రక్క తోటి మనిషి కులం ఎంచటం, గ్రూపులు కట్టడం, కక్ష తీర్చుకోవడం జరుగుతున్నది.
మీరు ఏముట్లయ్యా అంటే కోమట్లం అన్నాడట. కులం అడిగి గాని కూలి పనిలోకి తీసుకునేవారు కాదట వెనుక. కులంగలవాళ్ళు గోత్రం కలవాళ్ళూ, విద్య చేత విర్రవీగేవాళ్ళూ పసిడిగల్గువాని బానిసకొడుకులురా ఎదవల్లారా అని వేమన వాయించినా వీళ్ళకి సిగ్గు రాలేదు. గాలికి కులమేది? నేలకు కులమేది? అని ఒకాయన పాట రాశాడు. కానీ కొడుక్కి పెళ్లి మాత్రం తమ కులకాంతతోటే జరిపించాలన్నాడు.
రాష్ట్రపతి పదవికి ప్రతిపక్షాలవాళ్ళంతా తమ తరపున ఎవరిని నిలబెట్టాలా అని దేశ ప్రముఖుల “కుల గోత్రాల చిట్టా” ను పరిశీలించినట్లు వార్తలొచ్చాయి. కులం తక్కువవాడు కూటికి ముందా? అని కొందరు కులీనులు కూసినట్లు తెలిసింది. ఏ కులమూ నీదంటే గోకులము నవ్విందట. మాధవుడు యాదవుడు మా కూలమేలె మ్మందట, మరి ఏనాడయినా యాదవుడిలో మాధవుడిని చూసిన మనుషులున్నారా ఇక్కడ? ఒక్క యాదవుడిలోనేగాదు మాదిగవాడిలో మాత్రం మాధవుడిని ఎందుకు చూడకూడదు?ఆయన సర్వాంతర్యామిగదా?
బొందెలుగనవేరు భువి ప్రాణమొక్కటే
అన్నములిలవేరు ఆకలోకటే
దర్శనములే వేరు “దైవంబు నొక్కటే”
అని అందరూ అంటుంటారు. మరి వీళ్ళకి ఏమి పెద్ద రోగం వచ్చిందో గాని అదే మనుషులు అదే నోటితోటి చండాలుడా, పంచముడా అనే అన్యాయపు కూతలు కూస్తారు. ఆ నోళ్లకు పక్షవాతము వచ్చిన రోజునే పంచములకు మంచి జరుగుతుంది.
కారంచేడు ఘనకార్యం గురించి ఏడాదికోసారయినా తక్కువ కులాలవాళ్ళకు గుర్తుచేయాలనే సదుద్దేశంలో భాగంగా నీరుకొండవాళ్ళు ఈ ఏడాది వార్షికోత్సవం జరిపారు. బరిసెపోట్లు, బడితె దెబ్బలు ఇందులో ప్రత్యేక ఆకర్షణలు. ఇక దేచవరం సంగతి దేవిరించినట్టే ఉంది. అది రెండు పెద్ద కులాల మధ్య పోరాటం. సాదాసీదాది కాదు. సాగినంతకాలం పల్నాటి సీమంతా రెడ్డి వీరులు రాజ్యం చేశారు. కమ్మవాళ్ళు కుక్కిన పేనుల్లా ఇంతకాలం పడివున్నారు. అయితే ఆ రోజులు పోయాయి. రామరాజ్యం వచ్చింది. రాక్షస సంహారం పేరుతో ఈ దండు బయలుదేరింది. రామరావణ యుద్ధంలో అమాయకులయిన కోతిమూక, రాక్షసులు (ద్రావిడులు) బలయిపోయినట్లుగా ఈ అగ్రవర్ణాల వాళ్ళ పోట్లాటల్లో వెనుకబడిన కులాలవాళ్ళు సైనికుల్లాగా పాల్గొని చనిపోవటం, వాళ్ళ భార్యలు ముండమోయడం, వాళ్ళ కుటుంబసభ్యులు కాపుల వద్ద జీతగాళ్ళు కావటం జరుగుతున్నది. సరే అది వేరే విషయం.
ఇక్కడ చెప్పదలుచుకున్న అతి ముఖ్య విషయం ఏమిటంటే ”రెడ్డి రాజులు వర్సస్ కాకతీయ రాజులు”. ఇద్దరూ రాజులే, అయితే రాజ్యం ఎవరిది? అనే అంశంపైనే వీరి మధ్య పోరాటం జరుగుతున్నది. పార్టీలతో ప్రమేయం లేకుండా ఎక్కడెక్కడున్న రెడ్డి రాజులంతా కాకతీయుల మీద విరుచుకుపడుతూ ఉండటం, అసెంబ్లీలో తమ అక్కసు వెళ్లగ్రక్కటం మనం
చూస్తూనే ఉన్నాము. సమరసింహారెడ్డి అనే ఆయనయితే 10 మంది కమ్మ అధికారుల పేర్లు లిస్టు రాసుకొచ్చి మరీ అసెంబ్లీలో చదివాడు. గత 35 సంవత్సరాల రెడ్ల లిస్టు మేం కూడా చదువుతామనీ బుచ్చయ్య చౌదరి ఆవేశపడ్డాడు. కాబట్టి ఏతావాతా తేలిందేమిటంటే కులవృత్తికి సాటి రాదు గువ్వలచెన్నా అని. కామన్ పర్పస్ కోసం ఒక కులపోళ్ళంతా ఒక చోటికి చేరటం, అందుకోసం తమ పార్టీల ఆదర్శాలను సయితం కాలదన్ని కులం పిచ్చితో కృళ్ళిపోవటం మన రాజకీయనాయకులకు అలవాటయిపోయింది. వాటి ఫలితమే ఈ దేచవరాలు, కారంచేడులు, నీరుకొండలు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి