పుణ్యభూమిలో పడతి గీటురాయి 1-10-1987
కుష్టు వ్యాధితో కుళ్ళిపోయిన భర్తను గంపలో
బెట్టి నెత్తిన మోసి పోషించిన సతులున్నారు.భర్తను బ్రతికించుకోటానికి నానాపాట్లు
పడిన సతులున్నారు.మొగుళ్ళుచేసిన
అడ్డమైన పనులకి వత్తాసు పలికి, మొగుళ్ళని వేశ్యలదగ్గరకి
మోసుకుపోయినపతివ్రతలున్నారు.మన
దేశంలో నిర్ధాక్షిణ్యంగా భర్త చేతదాసిగా అమ్మబడిన సతులు,కారడవుల్లో విడువబడిన సతులు,కిరసనాయిలుకు ఆహుతి అయిన సతులు, ఉరివేయబడిన సతులు,బండరాళ్లతో
గండ్ర గొడ్డళ్లతో తలలు పగలగొట్టి చంపబడిన సతులు, శిరచ్ఛేధం
చేయబడిన సతులు, గుండుగీసి మూలనకూచోబెట్టి నీచంగా చూడబడిన సతులు మన దేశంలో ఉన్నారు. 21 వ శతాబ్ధానికిదాపులో
ఉన్నామనేగాని రాతియుగం పద్ధతులే ఇప్పటికీ అమలు జరుగుతున్నాయి.
సతులారా! మీ చెరలు తీరేదెన్నడో కదా?
“నా రాశి మిధున రాశి
నా రాశి కన్యరాశి
కలిసేను జాతకాలు
కలవాలి జీవితాలు”
అని ఇద్దరు
ప్రేమికులు డ్యూయెట్ పాడుతారు. అంత వరకు బాగానే ఉంది. ఏదో జాతకాల పిచ్చి ఉంది కాబోలు అని మనం సర్దుకుపోతాం. ఆ పిచ్చి బాగా ముదిరిందో ఏమో ఇంకా
ఏమంటారంటే
“రాముడు వెలసిన శుభఘడియలలో
నేను నీ కోసం వెలిశాను
జానకి పుట్టిన శుభలగ్నములో
నేను నీ కొరకే పుట్టాను”
ఇదే అర్ధం కాదు. ఈ
పోలిక కంటే మొదటి పోలికే నయం అనిపిస్తోంది.కుర్రవాళ్ళు దూరాలోచన లేక ఇలా పోల్చుకున్నారేమో
అని సముదాయించుకుందాం. “అడవుల పాలవటం, అగ్ని
పరీక్షకు గురికావటం, అయినా భర్త అనుమానానికి గురై మళ్ళీ అడవుల పాలవటం జానకీదేవి జాతకం గదా వీళ్ళ జాతకాలు
కలవ్వే” అని ఆ పాట విన్న జ్యోతిష్కుడు అన్నాడు. నిజమే జాతకాలు కలవచ్చు గాని, జీవితాలు
కలవటమే కాపురానికి శుభం.
కవిరాజు శ్రీ త్రిపురనేని రామస్వామి తన “సూతపురాణం”లో ఇలా వ్రాశారు. “శ్రీరాముడు నిండు చూలాలిని మోసగించి
కారడవిలో వదిలి పెట్టించేను. ఈ కార్యము
పచ్చి నెత్తురు ద్రావు కటిక వాడయిన జేయ సాహసించునా ? ఎట్టులో అడవిలో నున్నమున్యాశ్రమము నుండి సీతాదేవి అయోధ్యకు
కొనిరాబడెను. శ్రీరామచంద్రు సమ్ముఖంబున నుంచబడేను. మరలా ఎప్పటి పాటయే అనుమానము వదిలింపుమని శ్రీరాముడు సీతను గోరెను. సీత మనస్సు చివుక్కు మనియెను. నిరంతరము సంశయాత్ముడగు భర్తతో
కాపురము చేయరోసి, ఏవపడి, సభాముఖంబున
పెక్కు వేల మంది చూచుచుండ భూవివరంబున ప్రవేశించి ఆత్మహత్య గావించుకొనెను.
ఈ కథ శ్రీరామ చంద్రుని ఏకపత్నీ వ్రతము ఎట్టిదో
నిత్యము చాటుచుండును. సీతమ్మ చెరలకెవ్వరు మూల హేతువు?”
సీతమ్మ భూమిలో సజీవంగా సమాధి అయితే, ఎందరో సీతలు ‘సతీసహగమనం’అనేదుర్మార్గమయిన, అతి
హేయమయిన, నికృష్టమయిన ఆచారానికిబలైపోయారు.పూర్వకాలం
నుండి పురుషుల దురహంకారం ఎందరో తల్లుల్నిపొట్టనబెట్టుకుంది.రూప్ కన్వర్ అనే 19 ఏళ్ళ పడుచుకు నరనరాన ఈ దురభిప్రాయాన్ని బోధించి, విచ్చుకత్తులు
పట్టుకుని పహరా కాస్తూ ఆమెను భర్త చితిపై కూర్చోబెట్టి
కాల్చి వేయటమేగాక కొన్ని లక్షల జనం అదొక పవిత్ర కార్యమైనట్లు తండోపతండాలుగా కదలి రావటం సిగ్గుచేటు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి