అంతా అంకెల గారడీ
గీటురాయి 10-3-1989
ఎందుకేడుస్తున్నావురా పిల్లవాడా ? అంటే, ఎల్లుండి మా అమ్మ కొడుతుందని
అన్నాడట. అచ్చం ఆ పిల్లవాడి లాగానే మనమంతా ప్రాణాలు బిగబట్టుకొని ప్రతి ఫిబ్రవరి నెలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాధినేతలు
విసిరే బడ్జెట్ బాక్సింగ్ దెబ్బల్ని
కాచుకునేందుకై ఏడుస్తూ ఎదురు చూస్తుంటాం. ఎ.ఎ. ఎక్కడనుంతొత్తున్నావోయ్ నత్తాయానా ? అంటే రె.రె.
రెడ్డోరింటి నుంచోయ్ న నంగాయనా
అన్నట్లుగా కేంద్రాన్ని రాష్ట్రం,
రాష్ట్రాన్ని కేంద్రం ఎత్తి పొడుచుకోవటం
తప్ప రెండింటి బొక్కలు పూడే అవకాశమేలేదని ప్రజలు గ్రహిస్తూనే ఉన్నారు. 230 కోట్ల లోటు వీళ్ళు
చూపిస్తే 7337 కోట్లు బొక్క వాళ్ళు
చూపించారు. ఇది ఎలా పూడుస్తారోయ్ అని అడిగితే ఇదివరకటి ఏళ్ళల్లో ఎలా పూడ్చామో ఇప్పుడూ అలానే అని
నీళ్ళు నములుతూ సమాధానం చెబుతున్నారు.
పెద్ద తాత గనుక పిల్లలికి తాయం పెడతా రండిరా పిల్లలూ అని ఊరించినట్లుగా ఆర్ధిక
మంత్రులు యమ రహస్యంగా సూట్ కేసులో దాచి మరీ ఈ బడ్జెట్ బాధల్ని తీసుకొచ్చి జనం నెత్తి మీద మోపటం, జనం ఇన్నేళ్లనుండీ మోస్తూ రావటం గమనిస్తూనే ఉన్నాం.
చింత దూత
తూతిందే అన్నదట ఒకటే. తూతే
కాలం వస్తే తూతదా అన్నడట. ఇంకొకాయన దొందూ దొందే అన్నాడట మూడో ఆయన. అలా ఉంది మన దేశ పరిస్థితి. అధికారంలో ఉన్న పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా అదోరకం నంజు వ్యాధితో తీసుకుంటున్నట్లుగా
ఉంది.
అదికారంలో
ఉన్న ఆయన ప్రతిపక్షాల వాళ్లందరినీ కలిపి టెర్రరిస్టుల అనుంగు సోదరులని కితాబు ఇస్తే, వీళ్ళంతా సభ
నొదిలి పెట్టి బయటికెళ్ళి బిగుసుకుపొయ్యారు. తీరా మన్మధ బాణం లాంటి బడ్జెట్ను ప్రయోగించగానే వారిలో సభమీద తీపివలపుల బాధలు పెరిగిపోయాయి.
పార్లమెంటు బయటే చిక్కి చికిలించే కంటే లోపలి కెళ్ళి వెక్కిరించేది మేలు అని ప్రతిపక్షాల
వాళ్ళు చివరికి నిశ్చయించుకున్నారు. అలిగి బయటకెళ్లిన వాళ్ళను లోనికి రప్పించిన ఘనత
బడ్జెట్ సూటకేస్ దేనా కాదా అనేది మనం ఆలోచించాలి.
ఎన్నికలొస్తున్నాయి
కాబట్టి బతికిపొయ్యాం లేకపోతే ఏమై పొయ్యేవాళ్ళమో ! అక్షయ తూణీరాలతో నిండిన అంబులపొది (సూట్ కేస్) కలిగిన
సవ్యసాచితో నేటి ఆర్ధిక మంత్రుల్ని పోల్చవచ్చు. బాణాన్ని వదలటానికి తిరిగి పొదిలోకి వాపసు
తీసుకోవటానికి శక్తి కలిగిన విలుకానితో
ఆర్ధిక మంత్రుల్ని పోల్చి పొగడవచ్చు. ఆ విధంగా ఆర్ధిక మంత్రిని ఉబ్బవేసి కొన్ని రాయితీలు రాబట్టవచ్చు. ఈ సారి ప్రదర్శించి
ఆర్ధిక మంత్రిని బుట్టలో వేసుకుంటే మంచిదని నా నమ్మకం. చింతాకంత బంగారం-మెడచుట్టూ పెద్ద పట్టెడ కావాలన్నట్లుగా కాకుండా, ప్రణాళికేతర వ్యయంలో కోత పెట్టి వచ్చిన లోటును పూడ్చమని కోరితే
చాలు. ఈ ఏటికి కొత్త పన్నులు వెయ్యరనే
భయం ప్రజలకు తొలగిపోతుంది. ఎప్పుడో ఒకప్పుడు
పన్నులు తప్పక వేస్తారనే భయంతో తాలు కంకులే దాసరీ అంటే రాలిన కాడకే గోవింద
అన్నాట్ట. ప్రతి పక్షాల వాళ్ళు ఓ పట్టు పట్టాలి.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి