దుష్టులను అందలమెక్కిస్తే...
గీటురాయి 15-9-1989
కరువుకు గ్రహణాలెక్కువ అన్నారు. కరువులోనే అధికమాసం గూడా వచ్చిందంటూ కొందరు బాధపడతారు. అంటే శ్రాద్ధాలూ గట్రా పెట్టాలంటే ఇంకో నెల ఎక్కువౌతుంది. ఖర్చుమోపెడై పెట్టే
వాడు సణుక్కుంటాడు. అన్నగారి
పాలన ఆరంభమైంది మొదలు అన్నింటికీ కరువు ఏర్పడి, కాంగ్రెస్
వాళ్ళు కల్పించే గ్రహణాలు మాత్రం ఎక్కువైపోయాయి. రాజకీయ నాయకులకు ‘సివిటమిన్’ (సిగ్గు) చాలా తక్కువని చాలా కాలం క్రితం చెప్పినట్లు గుర్తు. మనకు తిండి కరువు అయితే
వాళ్ళకు సిగ్గు కరువు అన్నమాట. అందుకే
ప్రజలు ఏమనుకుంటారో అని కూడా సిగ్గుపడక అనేక చిల్లర
పనులకు వాళ్ళు తెగిస్తారు.
రాజుకు విశ్వాసం, వ్యభిచారికి సత్యము, దొంగకు భయము, వేశ్యకు
మొహమాటము, పిరికిపందకు ధైర్యము, మందగొడ్డుకు పాలు చాలా కరువు అన్నారు. రాజకీయ నాయకులకు సిగ్గు మహాకరువు
అని మనం నిశ్చింతగా అనుకోవచ్చు. ముడుపులు
పుచ్చుకున్నట్లు,
సాక్ష్యాధారాలు దొరికాయి గనుక
గద్దెదిగిపొమ్మని కేంద్రంలోని అయ్యను ప్రతిపక్షాల వాళ్ళు ప్రాధేయపపడుతుంటే ఇక్కడ అన్నను గద్దె మీద నుంచి
పడదొయ్యమని కాంగీయులు
కోటి సంతకాలు పట్టుకెళ్లి రాష్ట్రపతి దగ్గర ప్రాకులాడారు. కరువుకు దాసరులైతే పదాలెక్కడ నుండి
వస్తాయి అని వెనుక భయపడేవారు. కానీ
కాంగీయులకు కోటి సంతకాలు చేసేవాళ్ళు కొదవ లేకుండా దొరికారు. రామకోటి రాసినట్లుగా
ఒక్కొక్కరే వంద సంతకాలు చేసి ఉండొచ్చని
చంద్రబాబుగారు వంకపెట్టారు. కళ్ళు రెండున్నా
కనిపించే దొకటే నన్నట్లుగా
రాష్ట్రపతి పరిస్థితి తయారయ్యి, ఆ సంతకాల కట్టలు
కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తానని
ఆయన మాట ఇచ్చారు.కసి పోనమ్మ మసి పూసుకున్నట్లుగా
ప్రతిపక్షాల వాళ్ళు రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా మరో మహజరు సమర్పించదలచారు. ప్రతిపక్షాల మహజరు అందుకుంటే తన మెడకు
ఎక్కడ చుట్టుకుంటుందో అనుకున్నారేమో రాష్ట్రపతి యమస్పీడుగా చిక్కకుండా ఢిల్లీ వెళ్ళి పోయారు. పోస్టు ద్వారా
పంపిద్దాంలే అని ప్రతిపక్షాల వాళ్లు
అనుకున్నారు. మహజర్ల తోటే పనులై పోయేటట్లయితే ఇక ఓటర్లం మనమెందుకు ? వీళ్ళందరినీ అయిదేళ్లకొకసారి ఎన్నుకోవటం ఎందుకు ? కరిచే
కుక్కకు కర్ర అడ్డమై పోయినట్లుగా, ఈ
అడ్డగోలు నాయకులకు ఎలక్షన్లే పెద్ద
ఇబ్బందిగా ఉన్నట్లు తోస్తున్నది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లే పెద్ద ఇబ్బందిగా ఉన్నట్లుగా తోస్తున్నది. ప్రజాస్వామ్య
బద్దంగా ఎలక్షన్లలో నిలబడి గెలిచి, అయిదేళ్ళు సజావుగా నీతిదాయకంగా
పాలించి, ప్రజల మెప్పు
పొందవలసిన వాళ్ళు అతిఘోరమైన పనులకు పాల్పడి సిగ్గూ ఎగ్గూ లేకుండా ఇలా పోటీలు పడి బందులు నిర్వహించటం, మహజర్లు సమర్పించటం, ఒకళ్ళ నొకళ్లు, తిట్టుకోవటం, చంపుకోవటం చూస్తుంటే, పదవుల కోసం వీళ్ళు ఎంతగా
పడిచస్తున్నారో, ఏమి ఆశించి పదవులను కోరుకుంటున్నారో
ప్రజలకు ఇట్టే అర్ధమైపోతున్నది.
కళపెళయ్యగారు కస్తూరి
అడుగుతున్నారు నాన్నా అంటే, మూలగురిగెలో ముత్యాల సరాలున్నాయి
తీసుకెళ్ళమ్మా అన్నాడట. దేశ సంపదను
తాము దోచుకుంటున్నదే గాక విదేశాలకు దోచిపెడుతూ, అక్కడి బ్యాంకుల్లో డబ్బుదాస్తున్నారని అనేకుల మీద ఆరోపణలొచ్చాయి. వీళ్ళంతా ఎలక్షన్లలో నిలబడి మళ్ళీ గెలవాలని
తంటాలు పడుతున్నారు. మనవళ్లతో ముచ్చటిస్తూ
కాలం గడుపుకోవాల్సిన సంజీవరెడ్డిగారికి కూడా వీళ్ళ సంపాదన బాధ కలిగించిందంటే అది ఎంత గొప్పదై
ఉంటుందో ఆలోచించండి.
ఏమైనా దేశ పరిస్థితి
కమ్ములదుప్పటి కొమ్ములబర్రెలాగా తయారయ్యింది.
ప్రజానాయకుల అవినీతిని ప్రజలే బట్టబయలు చేస్తూ, ఓట్ల కోసం
వచ్చినప్పుడు చీవాట్లు వేస్తూ, దొంగలని
తేలిన వారిని బ్లాక్ లిస్టులో పెట్టుకుంటే బాగుంటుంది. కాని విచారం ఏమిటంటే
ప్రజానాయకుల్లో ఉండే సిగ్గుమాలినతనం
ప్రజల్లో కూడా ఉంది. సారాయికీ డబ్బుకీ ఆశ పడి దుష్టులకు ఒట్లేసే జనం
ఉన్నంతకాలం దుష్టులే గెలుస్తుంటారు. ఆ విచక్షణా ఙ్ఞానమే ప్రజలలో కరువుగా ఉంది గనుక సిగ్గు కరువెరుగని నాయకులు సదా
వారి మధ్య వెలిగిపోతూ ఉన్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి