తథాస్తు దేవతలుంటారు
జాగ్రత్త!
గీటురాయి 5-5-1989
మంగలి
కత్తి మీద అంగ వేసినట్లు, కోడె త్రాచును ముద్దు పెట్టుకున్నట్లు, కొరివితో నడినెత్తి గోకుకున్నట్లు, పెద్ద పులితో సాముకు పూనినట్లు, కొదమసింహాన్ని రాళ్ళతో అదిలించినట్లు, కరకు వజ్రపు రవ్వమింగినట్లు, కొర్తి మీద గొంతు కూర్చున్నట్లు, నూతి మీద పసి బిడ్డనుంచినట్లు, క్ష్మాతలేంద్రుల (హస్తిన ప్రభుత్వం) సేవ కష్టము, వాళ్ళిచ్చారని
గర్వంతో నిక్కి ఎగురబాకురానాయనా అని ఒక పెద్దాయన ఉద్యోగం దొరికిన వాడికి సుద్దులు చెప్పాడు. మన
నేదురుమల్లి జనార్ధనరెడ్డి గారి లాగా
వాడు కూడా ఈ సత్యాలు నిదానంగా తెలుసుకున్నాడు. ఆశకుపోతే
గోచె ఊడిందన్నట్లుగా అయ్యింది. అధిష్టాన వర్గం చటుక్కున తన పవర్ చూపించింది. చెన్నారెడ్డిని ప్రదేశ్
కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేసింది. 12 మంది
ఉపాధ్యక్షులు 14 మంది ప్రధాన కార్యదర్శులు, 14 మంది సంయుక్త కార్యదర్శులు,
ఇలా మొత్తం వంద మంది తోటి ఓ పెద్ద ప్రదేశ్ కాంగ్రెస్ పుష్పక విమానాన్ని కూడా తయారుచేసింది. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే
మాదాసు గంగాధరం, హరిరామ జోగయ్య, నల్లపురెడ్డి శ్రీనివాసులు
రెడ్డి లాంటి వాళ్ళకు కూడా ఏదో ఒక పదవి కట్టబెట్టడం. ఇక పాపం జనార్ధన
రెడ్డి మాత్రం కాంగీ బోధకుడిగా మిగిలిపోయాడు. ఇదంతా చూస్తుంటే ఆ మధ్య తెలుగు దేశం రాకముందు ముఖ్యమంత్రుల్ని టపటపా పీకి పారేసిన వరుస గుర్తుకొస్తున్నది. అయితే
అవసరం తీరాక కాంగీ తనను ఎలా
తుంగలో తొక్కిందో చెన్నా అప్పుడే మరచిపోయాడా
? పోలేదు.
ఆలు
ఆత్మకూరులో, మొగుడు బోయపల్లెలో , కుండా చట్టీ
కుణుతూరులో, తలంబ్రాలు తాడిపత్రిలో అన్నట్లుగా ఈ
ఎంపికలు
దింపికలూ
జరపటానికి విమానాలు ఎక్కాదిగా కాంగీ వాళ్ళకు ఏడాది పొడుగునా ఇదే సరిపోతున్నది. ఇక ఎక్కడి
ప్రజలు, ఎక్కడ ప్రజాసమస్యలు,
ఆసనాలు వేస్తే పాసనాలు పుట్టినట్లుగా, అయ్యవారిని చెయ్యబోతే
కోతి అయినట్లుగా కాంగీయులు చేస్తున్న ప్రయోగాలు మరింతగా ఇంకా మరింతగా అపహాస్యం పాలవుతూ
ఉన్నాయి.
ఆవు దూడను
బర్రెకు, బర్రె దూడను ఆవుకు మరగ వేసినట్లుగా కాంగీ రకరకాల ప్రయోగాలు చేస్తున్నది. కానీ పరిస్థితి పెద్ద సంతలాగా తయారై
ఎవరి యావ వాళ్ళది ఎవరికందింది వాళ్ళది అన్న చందాన తయారయ్యింది. ఇప్పుడు చెన్నయ్య కనుక్కున్న
గొప్ప సత్యం ఏమిటంటే తమలోని
రకరకాల పురుషోత్తముల్ని కలుపుతున్నది అన్నేనట. అన్న చలువ వల్లనే కాంగీయులంతా ఐక్యంగా ఉండగలుగుతున్నారట. అంటే ఇలాంటి వాళ్లందరినీ కలగలిపి అమాల్గమ్ చేసి, మాంచి “కాంగీ
సస్పెన్షన్” చేసి ఇచ్చిన సమర్ధుడు అన్నే గనుక, కాంగ్రెస్ మరి కొంత బాగుపడాలంటే అన్న మరికొంత కాలం
పదవిలో ఉండాలి. కాంగ్రెస్ సదా బాగుపడుతూ ఉండాలంటే అన్న కూడా పది కాలాల
పాటు పదవిలో ఉండాలి. చెన్నారెడ్డి గారు తథాస్తు అనంటారేమోనని భయంగా ఉంది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి