పెండ్లి పిలుపు
గీటురాయి 3-3-1989
“జీవితాన మరువలేము ఒకేరోజు
ఇరు
జీవితాలు ఒకటిగా పెనవేసేరోజు
అదే
పెళ్లి రోజు”
అని కొత్తగా
పెళ్ళయిన దంపతులు పాటలు పాడుతుంటారు.
“ఆహ
నా పెళ్లంట ఓహో నాపెళ్లంట
లోకమెల్ల
గోలంట టాం టాం టాం”
అని
చుట్టుపక్కాలకు, తెలిసినవాళ్లందరికీ శుభలేఖలు పంపి, వాళ్ళంతా
తమ పెళ్ళాం బిడ్డలు, గొడ్డు గేదెలతో సహా పెళ్ళికి విచ్చేసి, తామిచ్చే
చందన తాంబూలాదులు స్వీకరించి తమను ఆశీర్వదించి అక్షింతలు
వేసిపోవాలని ఆహ్వానిస్తారు. కేవలం గొంతుకింత చందనం పూసి, తాంబూలం
సమర్పించి ఇళ్ళకు వెళ్లిపొమ్మంటే, తమలపాకుల సంబడానికేనా ఇంత పెద్ద ఆహ్వానం అని పెళ్లికెవరూ రారు.
నాలుగు కూరలు, నవకాయ పిండి వంటలు, పప్పుతో పది కూరలు అన్నట్లుగా పెళ్లివిందు జరుగుతుంది. జరిగి తీరాలి లేకపోతే ప్రయాణపు ఖర్చులు కూడా కలిసిరావు. పెళ్లి నాటి పప్పు కూడు రోజూ రమ్మంటే వస్తుందా ఏమిటి అని ఇళ్ళల్లో ఇల్లాళ్ళు మొగుళ్ళ మీద విరుచుకుపడుతుండాలి. అంటే పప్పుకూడు
అంత పసందుగా ఉండాలి. ఇళ్ళల్లో మామూలుగా వండే పప్పుకంటే పెళ్ళినాడు
వండే పప్పు రుచిగా ఉంటుందట. అందుకే పెళ్ళికి చేసిన పప్పు పేరంటాళ్ళు చవి చూడటానికే సరిపోతూ ఉంటుంది. అలాంటి పప్పు కూటికి ముందు వెట్టి మూతకు వెనుక ఉండమని తెలివిగలవాళ్లు సలహా ఇస్తుంటారు. అప్పుచేసయినా పప్పుకూడు పెట్టి
తీరాలని పెళ్ళింటివాళ్లు
కూడా పడిచస్తుంటారు.
అదే
సాహెబులైతే చికెన్ బిరియానీ,
పలావు లాంటి వంటకాలతో పెళ్ళికి
విచ్చేసిన పెద్దల పొట్టలు నింపుతారు. మరి పెళ్లి మీద ప్రేమో పెళ్లి వాతావరణం మీద ప్రేమోగాని “వచ్చిన వాళ్ళు లేవరు. లెండి లెండి అంటే లేచినా తటాలున పోవరు, పోతూ నిలబడి పోతాం పోతాం
తొయ్యబాకండి అంటారు. సంభావన వేళ చూడాలి వీళ్ళ సాములన్నీ”
అని దాసు శ్రీరామకవి బాపన పురోహితుల
మీద విసుగు ప్రకటిస్తాడు. ఇక తురగా వెంకం
రాజైతే “బాజా భజంత్రీలు పప్పుకేడ్వ, బాజారు వెలదులు పసుపుకేడ్వ, వచ్చిపొయ్యే వారు వక్కలాకులకేడ్వ, గుగ్గిళ్ళకై పెండ్లి గుర్రమేడ్వ, పల్లకీ బోయీలు భత్యాలకై ఏడ్వ, పురోహితుడు నేబులకు ఏడ్వ, హారతి రూకలకోసం
ఆడబిడ్డలు ఏడ్వ, కట్నం
కోసం గ్రామకరణం ఏడ్వ పెద్ద మగడని పెళ్లి కూతురు ఏడ్వ, పిల్ల చిన్నది అంటూ పెనిమిటి ఏడ్వ. ఇన్ని ఏడుపులతో
పెళ్లి సాగింది, నర్రా పేరయ్య చేశాడయ్యా ఈనాటి కహహ, కమ్మకులమున
జన్మించి ఘనులు నవ్వ” అని ఎగతాళి చేస్తాడు.
ఇన్ని
రకాల ఏడుపుల్ని తట్టుకొని పెళ్లి చెయ్యాలంటే మాటలా ? ఉన్నా లేకపోయినా, తల తాకట్టు పెట్టి అయినా పెళ్లి భారీ ఖర్చుతో
చెయ్యాల్సిందేననే తపన తల్లిదండ్రులలో
ఉంటున్నది. దీనికి తోడు కట్నం బాధ. ఇందుకే
కాబోలు పెళ్ళిచేసి చూడమన్నారు. అయినా జనం జంకటం లేదు. మళ్ళీ పెళ్లిళ్ల సీజను మొదలైనట్లుగా ఉంది. గీటురాయి వాళ్ళకు ఆహ్వానాలు
అదేపనిగా అందుతున్నాయి. సిబ్బంది మొత్తాన్నీ
రమ్మనకుండా ఇద్దరినో ముగ్గురినో
రమ్మని బస్సు ఛార్జీలు కూడా పంపిస్తున్నారట
కొంత మంది. ఇది వారికి మహా ఇబ్బందిగా ఉందట. గీటురాయి గుంపు
మొత్తానీ పెళ్ళికి పిలిచే ధైర్యం ఎవ్వరికైనా ఉంటుందేమో వేచిచూస్తాం.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి